రామన్నా.. హరీశ్, సంతోష్ కుట్రలతో జాగ్రత్త : కవిత సంచలన కామెంట్స్

రామన్నా.. హరీశ్, సంతోష్ కుట్రలతో జాగ్రత్త : కవిత సంచలన కామెంట్స్

 బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత .. మాజీ మంత్రి హరీశ్, రాజ్యసభ మాజీ సభ్యుడు  సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ ,సంతోష్.. రేవంత్ తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.  వాళ్లిద్దరి  కుట్రలను గ్రహించకపోతే..పార్టీకి నష్టమని కేటీఆర్ కు  సూచించారు.వాళ్లిద్దరిని దూరం పెట్టి పార్టీని నాన్నను కాపాడాలని కవిత వ్యాఖ్యానించారు.  మీ చుట్టూ  ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కేసీఆర్ కు సూచించారు కవిత.   

రేవంత్,హరీశ్ రావు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తనపై కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. ఒకే ఫ్లైట్ లో హరీశ్ తో  వెళ్లారో లేదో రేవంత్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్  కుటుంబాన్ని చీల్చేందుకు పెద్దు కుట్ర జరిగిందని ఆరోపించారు.  బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందన్నారు కవిత. హరీశ్ రావు సీఎం కాళ్లు మొక్కి సరెండర్ అయ్యారని... హరీశ్, రేవంత్ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందన్నారు.  వాళ్లిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందన్నారు కవిత.  సంతోష్ వల్ల రామన్నకు చెడ్డ పేరు వస్తుందన్నారు.

ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు  ట్రబుల్స్ క్రియేట్ చేసి.. సాల్వ్ చేసినట్టు బిల్డప్ ఇస్తారని విమర్శించారు.  2018 ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులకు హరీశ్ రావు  నిధులు ఇచ్చారని ఆరోపించారు కవిత.  కాళేశ్వరంలో జరిగిన అవినీతి  వల్లే డబ్బులు వచ్చాయన్నారు. గజ్వేల్ లో  కేసీఆర్ ను  ఓడించేందుకు హరీశ్ ప్రయత్నించారని ఆరోపించారు .  నిజామాబాద్లో తనను  ఓడించేందుకు  ఎమ్మెల్యేలను హరీశ్ మ్యానేజ్ చేశారని  చెప్పారు. హరీశ్ రావు వల్లే కీలక నేతలు  జగ్గారెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు, ఈటల, చెరుకు శ్రీనివాస్.విజయరామారావు వీళ్లంతా  బయటకు వెళ్లారని తెలిపారు. రేపు నాకు వచ్చిన పరిస్థితి  కేటీఆర్ కు  కూడా వస్తదని సూచించారు కవిత.  ప్రజా సమస్యలను పట్టించుకుని  బీఆర్ఎస్ ను కాపాడాలని  కేటీఆర్ కు  సూచించారు. 

‘నాపై అక్రమ కేసులుపెట్టి తీహార్  జైల్లో పెట్టారు.  తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉన్న.  జైలు నుంచి వచ్చాక ప్రజాక్షేత్రంలో అనేక పోరాటాలు చేశా.  బీసీల కోసం,మహిళ పెన్షన్ల కోసం పోరాటం చేశా.  భద్రాచలం ముంపు సమస్యలపై పోరాడా.  జిల్లాల పర్యటనలో బీఆర్ఎస్ కండువానే వేసుకుని పర్యటించా. నేను చేసేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయి . పార్టీ నేతలు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి.  

హరీశ్, సంతోష్ పనిగట్టుకుని నాపై తప్పుడు రాతలు రాయించారు.  తెలంగాణ భవన్ లో ఉండే నాపై కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడినా.  నాపై కుట్ర జరిగితే  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఒక్క మాట మాట్లడలేదు. 112 రోజులవుతున్నా కేటీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నాతోనే మాట్లాడకపోతే మహిళా కార్యకర్తల పరిస్థితి ఏంటి.?.దేశంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ఏకైక వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ నుంచే సామాజికి తెలంగాణ పాఠాలు నేర్చుకున్నా.  ఉన్నది ఉన్నట్లు మాట్లాడినట్టు కాబట్టే నన్ను బయటకు పంపారు’.  అని కవిత వ్యాఖ్యానించారు.