
- 10 గంటలు.. 14 ప్రశ్నలు
- సౌత్ గ్రూప్ సంగతేంది?
- లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ
- రూ. 100 కోట్ల ముడుపులు, లావాదేవీలపై ఆరా
- సాయంత్రం ఈడీ హెడ్క్వార్టర్స్ ముందు హైటెన్షన్
- ఆఫీసు వద్దకు లాయర్లు, డాక్టర్లు రావడంతో ఉత్కంఠ
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
- ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కేటీఆర్, హరీశ్
- ఇయ్యాల మళ్లీ విచారణ.. ఉదయం
- 11 గంటలకు రావాలని ఈడీ ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దాదాపు 10 గంటల పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. 14 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఆరాతీసినట్లు సమాచారం. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు నుంచి ఈడీ హెడ్ క్వార్టర్స్కు కవిత బయలుదేరారు. డాక్యుమెంట్లు, ఈడీ నోటీసులతో 10.30 గంటల తర్వాత ఆమె లోపలికి వెళ్లగా.. తొలుత అక్కడి సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల ఈడీ ఆఫీసర్ల టీమ్ విచారణ మొదలుపెట్టింది. ఇందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉన్నట్లు తెలిసింది. ఒంటరిగానే విచారణ కవిత వెంట వెహికల్లో ఆమె భర్త అనిల్, అడ్వకేట్ సోమ భరత్ ఈడీ ఆఫీసుకు వచ్చారు. కవిత లోపలికి వెళ్లే ముందు భర్త అనిల్ ఆమెకు వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. కవితను ఒంటరిగానే ఈడీ విచారించినట్లు తెలిసింది. అరుణ్ రామచంద్ర పిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ఇంటరాగేషన్ చేసినట్లు కథనాలు వచ్చినప్పటికీ వాటిని ఈడీ వర్గాలు ధ్రువీకరించలేదు.
సాయంత్రం హైటెన్షన్
సాయంత్రం ఒకవైపు ఈడీ హెడ్ ఆఫీసు లోపల విచారణ జరుగుతుండగా.. బయట హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. కవిత తరఫున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు అడ్వకేట్లు ఈడీ ఆఫీసు దగ్గరకు వచ్చారు. వీరిలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్రావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు ఉన్నారు. ఆ తర్వాత అద్దగంటకు ఇద్దరు డాక్టర్లు కూడా ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఇందులో ఓ మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. తర్వాత డాక్టర్ల టీమ్ బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో ఈడీ ఆఫీసు వద్దకు నాలుగు ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు చేరుకోవడం.. భారీగా పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ కేడర్లో కనిపించింది. అనంతరం రాత్రి 9.10 గంటలకు ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు వచ్చారు. అప్పటికే వర్షం పడుతుండటంతో వర్షంలోనే నడుచుకుంటూ ఈడీ ఆఫీసు గేట్ వరకు వచ్చిన కవిత.. వాహనంలో ఎక్కారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న కార్యకర్తలకు ‘వీ’ సింబల్ చూపిస్తూ... అభివాదం చేశారు. పలువురు కార్యకర్తలు ఈడీ ఆఫీసు ముందే గుమ్మడి కాయతో దిష్టి తీశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కవిత తుగ్లక్ రోడ్లోని సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్, హరీశ్ రావు తుగ్లక్ రోడ్ లోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి ఈడీ విచారణ పై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నెల 11న సుమారు ఎనిమిది గంటలపాటు కవితను విచారించిన ఈడీ అధికారులు సోమవారం 10 గంటలకు పైగా ఎంటరాగేషన్ చేశారు. ఈ నెల 16న విచారణ రావాలని చెప్పినప్పటికీ.. ఆరోజు ఆమె గైర్హాజరయ్యారు. మహిళలను ఇంటి వద్దే విచారించాలంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు వస్తుందని, ఆ తీర్పు తర్వాతే వస్తానని ఆరోజు ఈడీకి లేఖ రాశారు. ఇందుకు అంగీకరించని ఈడీ.. ఈ నెల 20 (సోమవారం) విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో కవిత హాజరయ్యారు.
క్రాస్ ఎగ్జామిన్
లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్ లోని సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్ హోటల్స్ లో పాల్గొన్న వీడియో పుటేజ్, బుచ్చిబాబు, పిళ్లై మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన స్టేట్మెంట్ తదితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కూపీ లాగినట్లు తెలిసింది. లావాదేవీలు, ఇండో స్పిరిట్- సౌత్ గ్రూప్ దక్కించుకున్న 9 జోన్ల పై ఆరా తీసినట్లు సమాచారం. ఆ దిశలో కుదిరిన ఒప్పందాలు, అందుకు శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి హవాలా రూపంలో మళ్లించిన డబ్బు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశాలపై మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం.