
దత్తత తీసుకుంటున్నానని చెప్పి వాసాలమర్రిని మాజీ సీఎం కేసీఆర్ ఆగం చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఆగవ్వకు అన్నం పెట్టి.. వాసాలమర్రిని రోల్ మోడల్ గా చేస్తానని మాటిచ్చి ఆగం చేశారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓట్లు వేయించుకున్నారే తప్ప ఒక్క ఇల్లు కూడా కట్డించలేకపోయారని విమర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. కేసీఆర్ ఆగం చేసిన వాసాల మర్రిని ఆదుకుంటున్నామని అన్నారు. జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా.. వాసాలమర్రిని అభివృద్ధి చేయాలని ఆదేశించారని అన్నారు. వారం రోజుల్లోనే హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. పేదోడి చిరకాల కోరిక అయిన సొంతింటి కల సాకారం చేశామని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నామని చెప్పారు. గ్యాస్, కరెంటు, ఉచిత ఆర్టీసీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, పేదోడికి సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు ఇలా చెప్పిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ప్రభుత్వమంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని.. రూ.22 వేల 500 కోట్లతో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కలను నెరవేర్చుతున్నామని అన్నారు.
ఇక ధరణితో ఇబ్బంది పడ్డ రైతులను ఆదుకోవడం కోసం భూభారతి చట్టం తెచ్చినట్లు గుర్తు చేశారు. ధరణి తెచ్చిన కేసీఆర్ భూములను ఖతం చేశారని.. కానీ తమ ప్రభుత్వంలో భూసమస్యల పరిష్కారం కోసం అధికారులే ఊర్లలోకి వచ్చి సమస్యలు తీర్చుతున్నారని తెలిపారు. భూభారతి చట్టం ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుందని చెప్పారు. ఆగస్టు లోపు భూసమస్యలు మొత్తం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చేసి పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారని అన్నారు మంత్రి పొంగులేటి. మళ్లీ ప్రజలను నమ్మించి మోసం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.