
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం 40 మంది సీనియర్ నాయకుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిపాదించగా.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆ జాబితాకు మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో స్టార్క్యాంపెయినర్లుగా కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాతా మధుసూదన్, ఎల్ రమణ, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కృష్ణారావు, కేపీ వివేకానంద్, సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్ రెడ్డి, మల్లారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అనిల్జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్ తదితర నేతలున్నారు.
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫాంహౌస్కే పరిమితమయ్యారు. పార్టీ యాక్టివిటీస్పై అక్కడి నుంచే రివ్యూలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. వరంగల్ సభ తర్వాత ఎలాంటి రాజకీయ సభలకు వెళ్లలేదు. అటు నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయ పడినందునే ఆయన పేరు స్టార్క్యాంపెయినర్ల జాబితాలో చేర్చించినట్టు పార్టీనేతలు అంటున్నారు.
ఇప్పటికైతే కేసీఆర్ ప్రచారానికి దూరంగానే ఉంటారని , ప్రచారం చివరి దశలో వీలైతే ఆయనతో ఓ సభ నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికలో కేసీఆర్ప్రచారం చేస్తే తమ అభ్యర్థికి కలిసివస్తుందని పార్టీలోని ఓ వర్గం నేతలు అంటుండగా.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని ఆయన, కేవలం ఎన్నికల కోసమే బయటకు వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరో వర్గం నేతలు అభిప్రాయపడ్తున్నారు.