
సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పేరుతో తీసిన సినిమా అట్టర్ ఫ్లాపైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అబద్ధాలు, గారడీ చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఫాంహౌస్ కేసులో కోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టులాంటిదన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ల డేటాను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఫాంహౌస్ ఘటన అనంతరం నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు బంధించారని నిలదీశారు.
బురదలో నుంచే కమలం పువ్వు వికసిస్తుందని.. కానీ కమలానికి ఎలాంటి బురద అంటదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఫాం హౌస్ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కిషన్ రెడ్డి న్యాయస్థానాలపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపాడని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని.. ఫాంహౌస్ పేరుతో కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా కేసీఆర్ సర్కార్ తీరులో మార్పు రావడం లేదన్నారు. ఇతర పార్టీలపై బురద జల్లడం బీఆర్ఎస్ కు అలవాటేనని మండిపడ్డారు.