- విమోచన వేడుకలపై ఎంపీ బండి సంజయ్
మద్దూరు, వెలుగు: విమోచన దినానికి వక్రభాష్యం చెపుతున్న కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని వీరబైరాన్ పల్లిలో సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అమరవీరుల కుటుంబాలను మరిచిన ప్రభుత్వాలు ఎప్పుడూ మనుగడ సాధించలేదన్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన నేటి సీఎం ఇప్పుడు వక్రభాష్యం చెపుతున్నారన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీకి భయపడి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు జరుపుకోండని చెప్పడం ఆయన దొర పోకడలకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం బలిదానాలకు పాల్పడిన కుటుంబాలను ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. నిజాంను కీర్తిస్తూ వాస్తవాలను వక్రీకరించే కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ సాగనుందన్నారు. వీరబైరాన్పల్లి గ్రామానికి కేంద్రం నుంచి నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.