సీఎం కేసీఆర్ ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి. వరదలతో జనం కొట్టుకు పోతుంటే కనీసం ఆరాతీసే తీరిక కూడా కేసీఆర్ కు లేకుండా పోయిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షాలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే కేసీఆర్ హర్టీకల్చర్ పై సమీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. ఎప్పుడు ఏం చేయాలో తెలియని సీఎం కేసీఆర్ అన్నారు. నగరం అతలాకుతలం అయితే ఇదేనా సమీక్షకు సమయమని ప్రశ్నించారు. ప్రజలు చస్తుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. మూడు రోజులవుతున్నా ఇళ్లలో నీటిని తోడేసే ఏర్పాట్లు చేయలేదని, కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయడం లేదన్నారు ఉత్తమ్.
గ్రేటర్ను వంద రోజుల ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని.. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారన్నారు ఉత్తమ్. హైదరాబాద్ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముందు వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.