- మేం కాంగ్రెస్ మిత్రపక్షం
- ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం
- టీజేఎస్ చీఫ్ కోదండరాం
కామారెడ్డి, వెలుగు : మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘లెండి’ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి తాము మిత్రపక్షంగా ఉన్నామని, ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ మినిస్టర్దృష్టికి తీసుకువెళ్లి పనులు కంప్లీట్అయ్యేలా చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్సమీపంలో ఉన్న లెండి ప్రాజెక్ట్ను మంగళవారం కోదండరాం సందర్శించారు.
ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మధ్య 1987లో ప్రాజెక్టు గురించి అంగీకారం కుదిరి పనులు మొదలుపెట్టారన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చును మహారాష్ట్ర 62 శాతం, ఉమ్మడి ఏపీ 38 శాతం భరించాలన్నది ఒప్పందమన్నారు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. 6.36 టీఎంసీల ఈ ప్రాజెక్ట్లో మన రాష్ట్రానికి 3.63 టీఎంసీలు వస్తాయని, దాంతో 23 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సాగునీరందుతుందన్నారు.
14 గేట్లకు 8 ఏండ్ల కింద 10 గేట్ల పనులు పూర్తయ్యాయన్నారు. కొంత మేర కాల్వ పనులు కూడా జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కంప్లీట్చేయడానికి, పునరావసానికి రూ.800 కోట్లు అవసరమవుతాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని, విషయాన్ని కాంగ్రెస్ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. టీజేఎస్స్టేట్జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ప్రెసిడెంట్లు లక్ష్మణ్, తుల్జారెడ్డి, ప్రతినిధులు డీఆర్.శంకర్, డీపీ రెడ్డి, చందు, రమేశ్రెడ్డి, హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.