నిధులిస్తామన్నా కేసీఆర్ ప్రభుత్వం యూజ్ చేసుకోవడంలేదు

నిధులిస్తామన్నా కేసీఆర్ ప్రభుత్వం యూజ్ చేసుకోవడంలేదు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల కింద తెలంగాణకు నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అయినప్పటికీ ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నిధులను వాడుకోవడానికి తెలంగాణకు అర్హత ఉందని గ్రామీణాభివృద్ది శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంటు సాక్షిగా చెప్పారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిధులను వాడుకోవడం చేతకావడం లేదని విమర్శించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 70,674 ఇళ్లను మంజూరు చేసినప్పటికీ... ఒక్క ఇంటిని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి పార్లమెంటు సాక్షిగా మరోసారి వెల్లడయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనే విషయం మరోసారి అందరికీ అర్థమయిందని అన్నారు.