రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడెం మండలం గుంజల్ పహాడ్ గ్రామంలో మంగళవారం( మే16) భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. రంగారెడ్డి జిల్లాలో పూర్తి చేసుకున్న సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలోకి ఎంటరైంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు దండుకొంటుందని ఆరోపించారు. ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎం లాగా వాడుకుంటున్నారన్నారని విమర్శించారు. గతంలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను సందర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వరా ?
రైతులకు ఇన్పుట్ సబ్సిడీలను ఇవ్వకుండా ఎకరానికి 5వేల రూపాయిలు ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదన్నారు సీఎల్పీ నేత. పెరిగిన ధరలకు రైతుబంధు ఏ మాత్రం ఊరట కలిగించదన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. 2024 లోపల రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.