
- నల్గొండ మీటింగ్కు అమిత్ రెడ్డి గైర్హాజరు
- టికెట్ల రేసులో కాసాని, కంచర్ల కృష్ణారెడ్డి!
- లోక్ సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ నేతల వెనుకంజ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు జంకుతున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. సోమవారం నందినగర్ లోని తన నివాసంలో నల్గొండ, చేవెళ్ల బీఆర్ఎస్ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేస్తారనుకున్న ఇద్దరు అభ్యర్థులు కూడా డుమ్మా కొట్టారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మీటింగ్కు హాజరు కాలేదు. పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరిని పోటీలోకి దింపాలనే అంశంపై మీటింగ్లో చర్చించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా నిలిపితే ఫలితం అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ (ముదిరాజ్) సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ దీటైన అభ్యర్థి అవుతారని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు ఆయన సూచించారు. మాజీ మంత్రి సబితా రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఆయన కొడుకు వీరేశ్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేశ్ రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్ రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
నల్గొండ నుంచి కృష్ణారెడ్డి
నల్గొండ అభ్యర్థిగా ప్రచారం జరిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కేసీఆర్తో జరిగిన మీటింగ్కు హాజరు కాలేదు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహా పార్టీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాజకీయ సమీకరణాలపై కేసీఆర్ విశ్లేషించారు. పార్టీ అభ్యర్థులుగా ఎవరుంటే బాగుంటుందని నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కంచర్ల కృష్ణా రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లను పార్టీ నేతలు సూచించారు. మంగళవారం లోగా ఈ ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందో ఏకాభిప్రాయానికి రావాలని కేసీఆర్ అన్నారు. ఈ భేటీలో కంచర్ల కృష్ణా రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. అయితే పార్టీ నేతల్లో ఎక్కువ మంది కంచర్ల కృష్ణా రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, చెరుకు సుధాకర్, కడారి అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
జగదీశ్రెడ్డితో హుజూర్ నగర్ నేతలు
హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడటంతో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ భేటీకి హుజూర్ నగర్కు చెందిన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్షేత్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. సైదిరెడ్డి పార్టీని వీడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగదీశ్ రెడ్డి భరోసా ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉండే హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు కోరారు. అయితే ప్రస్తుతానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్కు హుజూర్ నగర్ సమన్వయ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. త్వరలో పార్టీ ఇన్చార్జిని ప్రకటిస్తామని హుజూర్ నగర్ నుంచి వచ్చిన పార్టీ నేతలకు జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు.
నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కదనభేరి సభ
కరీంనగర్లో కదన భేరి పేరిట భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో మంగళవారం సాయంత్రం సభ జరగనుంది. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ సభలో పాల్గొం టారని తెలిపాయి. ఇక్కడ నుంచే ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పాయి. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ సెంటి మెంట్గా ఉందని, ఇక్కడి నుంచి ప్రారంభిం చిన అన్ని పనులూ సక్సెస్ అయ్యాయని వివరించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండ సభలో మాత్రమే కేసీఆర్ పాల్గొన్నారు. ఇప్పుడిది రెండో సభ కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పార్టీ నుంచి పలువురు నాయకులు బయటకు వెళ్లిపోవడం, పార్టీ లోక్సభ అభ్యర్థులు తదితర అంశాలపై కేసీఆర్ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది.