
నాడు కేసీఆర్ తానే కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ గా తన మనసును రంగరించి సృష్టించబడ్డ మానస పుత్రిక కాళేశ్వరంగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అంతా తానే అన్నట్లు చెప్పుకున్నారు . కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ మార్వెల్. కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఎత్తిపోతలు. ఆ బాహుబలి మోటార్లు మహా శక్తివంతమైనవి. కాళేశ్వరం ప్రాజెక్టు ఘన కీర్తిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కేంద్ర అధికారులు ఆహా ఓహో అని కొనియాడారు. గవర్నర్ నరసింహన్ ప్రాజెక్టును సందర్శించి, హరీశ్ రావుకు కాళేశ్వరరావు బిరుదు ఇచ్చారు. కాళేశ్వరంకు సర్వజ్ఞుడైన కేసీఆర్, ఎందుకు ఘోష్ కమిషన్ ముందు యూటర్న్ తీసుకున్నారు? ఘోష్ కమిషన్ ముందు అంతా నేనే అని గొప్పలు చెబితే, శిక్ష ఖాయం అవుతుంది. అందుకే, అంతా నేనే కాదు. చేసిందంతా ఇంజినీరులేనని నేరం ఇతరులపై నెట్టేశారు.
కమిషన్ ముందు, కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిలువ చేయాలన్న నిర్ణయం అంతా అధికారులదే అని, నాకేం సంబంధం లేదని ఘోష్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు కేసీఆర్. పంపు హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని నిలువ చేయమని నేను ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ సురక్షితంగా తప్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వ హయాంలో రూ 280 కోట్ల నిధులు విడుదల చేశామని, వినియోగించాలని అధికారులకే ఇచ్చామని క్షేమంగా తప్పించుకుంటూ సాక్ష్యం ఇచ్చారు. ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూర్చే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నామని వివరించారు. కానీ, అది సాధ్యం కాలేదన్నారు. వాస్తవాలు చెబితే శిక్ష ఖాయమని యూటర్న్ తీసుకున్నారు.
బీజేపీతో 2014 నుంచి 2022 దాకా..
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు అనే సీడబ్ల్యూసీ పత్రం బీఆర్ఎస్–బీజేపీ పవిత్ర మైత్రిలో భాగంగా సృష్టించబడింది. ప్రతిఫలంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నిక, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు తదితర బిల్లులకు మద్దతునిచ్చింది. వీరి బంధం 2022 వరకు సాగింది. నితిన్ గడ్కరీ లాంటి కేంద్ర మంత్రుల నాటి గణ కీర్తనలు. వీరి పవిత్ర బంధం తెగిన (2022)తర్వాత కాళేశ్వరం కేసీఆర్ కుటుంబ ఏటీఎం అని మోదీ, అమిత్ షాలు, రాష్ట్ర నాయకుల మాటల తూటాలు మర్చిపోలేము.
తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేకుంటే..
మేడిగడ్డ వద్ద ఎక్కడివి?
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనేది ఎంత దుర్మార్గమైన కల్పితమో కాళేశ్వరం బ్యారేజీల అవినీతి అక్రమాలను ఎన్డీఎస్ఎ నివేదిక నిజాలను నిగ్గు తేల్చింది. 2022-–23 లో మేడిగడ్డ నుంచి విడుదలైన నీరు 4,628 టీఎంసీలు. 2019–-20లో 2,046 టీఎంసీలు. 2021-–22లో 2,671 టీఎంసీలు. 2023–-24 మేడిగడ్డ ఐదు అడుగులు కుంగి, మూడు అడుగుల వెడల్పుతో నిట్ట నిలువునా, అడుగు నుంచి పైవరకు చీలిన ఏటా 1,942 టీఎంసీలు నీరు విడుదలైంది. పై ఐదేళ్లలో మొత్తం 13,151 టీఎంసీల నీటిని మేడిగడ్డ విడుదల చేసింది. ఇందులో 85-–90 శాతం నీరు తుమ్మిడిహెట్టి ప్రాణహిత నుండి వచ్చిందే. ప్రాణహిత నది లేకపోతే మేడిగడ్డ వద్ద బ్యారేజీ అనే ఆలోచన కేసీఆర్కు కలలో కూడా రాదు. వీరు పచ్చి అబద్దాలను అద్భుతమైన నిజాలనీ చెప్పగల దిట్టలు.
తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కోసం
ఒప్పందం చేసుకొని..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కి 148 మీ. ఎత్తుతో కట్టడానికి అనుమతిస్తామని. 152 మీ. బ్యారేజీ కడితే ముంపు ఉంటుందని ఇందుకు అంగీకరించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారని కేసీఆర్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 100 మీ. మేడిగడ్డతో పాటు, తుమ్మిడిహెట్టి 148 మీ. వద్ద బ్యారేజీ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, ఒప్పందం కుదుర్చుకున్న 148 మీ. తుమ్మిడిహెట్టి ఎందుకు నిర్మించలేదు? ‘వార్ధ ప్రాజెక్టు’ తదితర పేర్లతో ప్రజలను వంచించ లేదా? తుమ్మిడిహెట్టి నిర్మిస్తే, మేడిగడ్డ పనికి రాకుండా పోతుందని, నీరు రాదని, మీకు కలిగిన భయం వాస్తవం కాదా?
వ్యాప్కోస్ బంధం?
వ్యాప్ కోస్(WAPCOS) లైడార్ సర్వే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని నిర్ణయించగా, ఆ నివేదిక ఆధారంగా బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వ్యాప్కోస్ సీఎండీ రాజిందర్ గుప్తా ఇంట్లో 38 కోట్ల రూపాయలను, నోయిడా, తదితర ప్రాంతాలలో విలువైన రియల్ ఎస్టేట్ భూములు, విల్లాల రిజిస్ట్రేషన్ పత్రాలు, భారీ బంగారం నగలను, సీబీఐ 2023 మే 3న దాడులు చేసి జప్తు చేసింది. ఆ సీఎండీని జైల్లో పెట్టింది నిజం కాదా? ఇదంతా పాపకార్యాల సొమ్మే కదా? ఇదే వ్యాప్కోస్ తుమ్మిడిహెట్టి బ్యారేజికి అత్యంత అనువైనదనీ, నీటి లభ్యత ఉందని 2008లో వైయస్సార్ కాలంలో సర్వే నివేదిక ఇచ్చింది నిజం కాదా?
నీటి నిల్వలకు ఆదేశాలు ఎవరిచ్చారు?
బ్యారేజీల్లో నీటి నిల్వకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ నిర్ణయం అధికారులదే అని కేసీఆర్ సురక్షితంగా పి.సి. ఘోష్ విచారణలో చెప్పారు. ప్రతి ఇంజినీర్ కు బ్యారేజ్కి, డ్యామ్ కు ఉన్న తేడా తెలుసు. వాటిని ఎలా నిర్వహించాలో తెలుసు. బ్యారేజీలో 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిలపకూడదు. ఎక్కువైన నీళ్లన్నీ నదికైనా లేదా కాలువ కైనా వెళ్లాలి. మేడిగడ్డలో 16, అన్నారంలో 12, సుందిళ్లలో 8 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించింది కేసీఆర్ కాదా? నాడు కాళేశ్వరం కీర్తి కీర్తనల ఖ్యాతి అంతా కేసీఆర్ కే చెందితే, నేడు శిక్షలకు మరికొందరిని బాధ్యులను చేస్తూ, పెద్దలు క్షేమంగా తప్పుకుంటున్నారు.
ప్రాజెక్టుల మరమ్మత్తులేవి?
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్కు ఇచ్చింది అత్యంత నామమాత్రం. కేటాయించిన నిధులకు, ప్రాజెక్టుల సంఖ్య, వాటి దుస్థితి, మరమ్మతులకు పొంతనే లేదు. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో పేరుకుపోయిన మరమ్మతుల అవసరాలకు, కేసీఆర్ కేటాయింపులు ఏ మూలకు సరిపోవు. కడెం ప్రాజెక్టు వర్షాకాలం వచ్చిందంటే రాష్ట్రాన్ని వణికిస్తుంది. కడెంకు అనేక కీలకమైన మరమ్మత్తులు చేయాల్సి ఉంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో పట్టించుకున్న పాపాన పోలేదు. మేము కేటాయించాం కానీ, అధికారులే వినియోగించలేదని, నేరమంతా ఇంజినీర్లపైకి నెట్టేశారు. ఎంత అబద్ధం. కాళేశ్వరం బ్యారేజీలపై కాగ్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు క్వాలిటీ కంట్రోల్ వైఫల్యం అయిందని, గాఢ నిద్ర పోయిందని చెపుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ తో సహా ఏ విభాగము కేసీఆర్ రాజ్యంలో స్వేచ్ఛగా పనిచేయలేదు. అలా చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు.
బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు నిర్ణయం ఎవరిది? తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత, గోదావరిలో ఏఏ ప్రాంతాలు బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. అంతకుముందే హై పవర్ కమిటీ సిఫారసు చేసింది. నాటి వ్యాప్ కోస్ సీఎండీ రాజిందర్ గుప్తాను అన్ని విధాల ప్రభావితం చేసి నివేదిక ఇప్పించింది వాస్తవం అని తేలింది. కేసీఆర్ రాజ్యంలో హైపవర్ కమిటీకి స్వతంత్రం లేదు. అధినాయకుడి ఆదేశాలను తూ. చా. తప్పకుండా పాటించడమే వీరి విధి. మేడిగడ్డకు, 3 బ్యారేజీలకు అనుకూలంగా నివేదిక ఇచ్చినందుకు, అధినాయకుడి సేవలో తరించినందుకు, హైపర్ కమిటీలో చాలామందికి ఈఎన్సీలు, తదితర పదవులు వరించాయి. పదవీ విరమణ తర్వాత కూడా వీరందరికీ ఎక్స్టెన్షన్ కేసీఆర్ ప్రభుత్వ కాలమంతా కొనసాగించారు.
అనర్థ రుణాలను చెల్లిస్తున్నది ప్రజలే!
కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలు, ఆ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే లాభాలతో, ఆ రుణాలను చెల్లించడం సాధ్యం కాదనేది ముందే జగమెరిగిన సత్యం. ఎందుకంటే కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రక్రియ, ఆర్థికంగా ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని ప్రణాళిక. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం ద్వారా లాభాలు సంపాదించడం సాధ్యంకాని ప్రక్రియ. బ్యాంకుల రుణ దాతలు, కేంద్ర సంస్థలు, అసలు, భారీ వడ్డీలు పొందుతుండగా, ప్రజల సేవలకు, భారీగా కోత పడింది. ఆ రుణాల అసలు వడ్డీలు నెల నెలా చెల్లిస్తున్నది కోట్లాది తెలంగాణ ప్రజలే.
తిప్పిపోతలైనాయి
బ్యారేజీల ఎంపిక సాంకేతికమైనదీ కాదు. వ్యాప్ కోస్ ది కాదు. హైపవర్ కమిటీది కాదు. బ్యారేజీలన్నీ కేసీఆర్ మానస పుత్రికలు. అందువల్లనే అన్ని బ్యారేజీలు, ఎక్కడా లేని విధంగా, గోదావరి నీళ్లను ఎదురు అదే నదిలో పైకి ఒక టీఎంసీకీ కోట్ల రూ.ల ఖర్చుతో ఎత్తిపోస్తాయి. పై నుంచి వచ్చే భారీ వరద, ఎత్తిపోసిన నీళ్లను, దిగువ సముద్రంకు ఖర్చు లేకుండా తన్నుకు పోతుంది. ఐదేళ్లలో ఎత్తిపోసిన 162 టీఎంసీల్లో, 63 టీఎంసీల ఎత్తిపోతల నీళ్లన్నీ తిప్పిపోతలై సముద్రంలో కలిసాయి.
- నైనాల గోవర్ధన్,
నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకుడు