ఖడ్గచాలనం కాదు..కరచాలనం చేయాలి:జగన్ సభలో KCR

ఖడ్గచాలనం కాదు..కరచాలనం చేయాలి:జగన్ సభలో KCR

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“కొద్ది క్షణాల క్రితమే రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణస్వీకారం స్వీకరించి, సర్వ మత పెద్దల ఆశీస్సులు స్వీకరించి, ప్రజలందరి ప్రేమ, అభిమానాలతో..  అఖండ విజయాన్ని సాధించి సీఎంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో, అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో అనుబంధంతో పరస్పర అవగాహనతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నమ్ముతున్నాను.

సీఎం జగన్.. మీ వయసు చిన్నది.. కానీ బాధ్యత పెద్దది(జనం హర్షాతిరేకాలు). బాధ్యతను అద్భుతంగా నిర్వహించే అభినివేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని.. గత 9 ఏళ్లలో ప్రస్ఫుటంగా నిరూపించారు. వయసు చిన్నదైనా మీకు ఆ శక్తి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నా. మీ కార్యనిర్వహణలో, మీ హయాంలో.. సుభిక్షంగా ప్రజలంతా ఉండాలని… సంపూర్ణ విజయం సాధించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

ఈ సందర్భంగా ఓ మాట. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఇపుడు మనం చేయవల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో ఆత్మీయతతో.. అనురాగంతో పరస్పరం సహకరించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్ ముందున్న కర్తవ్యం.. గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. వందశాతం జరిగి తీరాలి. జరుగుతుందని నమ్ముతున్నా.

కృష్ణా నదిలో మనకు సమస్యలున్నాయి. అక్కడ లభించే ఒక్కో నీటిబొట్టును ఒడుపుగా, ఒద్దికగా… ఉభయ రాష్ట్రాల వాళ్లం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో.. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నా. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైన అండదండలు సహాయక సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని తెలియజేస్తున్నా. జగన్ కు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సద్వినియోగం చేసుకుని నాన్న పేరు నిలబెట్టాలి. చరిత్రలో నిలిచిపోయేలా కీర్తిప్రతిష్టలు సంపాదించాలి. మతపెద్దలు దీవించినట్టుగా ఒక టర్మ్ కాదు.. 3,4  టర్మ్ ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నా” అని కేసీఆర్ తన ప్రసంగం ముగించారు.