మునుగోడులో ప్రత్యర్థులు, సొంత పార్టీలోని అసంతృప్త నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా

మునుగోడులో ప్రత్యర్థులు, సొంత పార్టీలోని అసంతృప్త నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా
  • పోలీసులు, ఇంటెలిజెన్స్​తో పాటు టీఆర్​ఎస్​ తరఫున నిఘా
  • స్థానిక లీడర్లను నమ్మని పరిస్థితి..
  • పక్క జిల్లాల  నేతలకే టీమ్​లో బాధ్యతలు

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. విజయం కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని సమాచారాన్ని పోలీస్​, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నది. ఈ క్రమంలో నల్గొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీస్ నిఘా బృందాలు గ్రామాలను జల్లెడ పడ్తున్నాయి. వీరిలోనూ కోవర్టులు ఉండవచ్చని అనుమానిస్తున్న టీఆర్ఎస్​ హైకమాండ్.. పార్టీ తరఫున నిఘా టీమ్​లను రంగంలోకి దింపింది. కేసీఆర్​ స్క్వాడ్ గా భావిస్తున్న ఈ టీమ్​లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో  ఎవరెవరు పార్టీ మారారు..? కొత్తగా ఎంత మంది పార్టీలో చేరారు..? పార్టీలో చేరినవారిలో ఎవరైనా కోవర్టులు ఉన్నారా? ప్రత్యర్థి పార్టీల లీడర్ల నుంచి ఎవరెవరికి ఫోన్లు వస్తున్నాయి? ఎవరు ఎవరితో టచ్​లో  ఉంటున్నారు? లాంటి వివరాలు రాబడుతున్నాయి.  

నల్గొండ, వెలుగు : మునుగోడులో ప్రత్యర్థులతోపాటు, సొంత పార్టీలోని అసంతృప్త నేతల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి, ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ సీక్రెట్​ఆపరేషన్​ చేపడుతున్నది. పార్టీ లీడర్లతో ‘కేసీఆర్​స్క్వాడ్​’ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోకి వదిలింది. మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్​ లాంటి జిల్లాల నుంచి చురుకైన నేతలకు ఈ బాధ్యతలు అప్పగించి.. స్మార్ట్​ఫోన్లు ఇచ్చి.. ఊర్లల్లో  చక్కర్లు కొట్టిస్తున్నది. వారం రోజులుగా సర్వే పేరుతో గ్రామాలను చుట్టివస్తున్న ఈ నిఘా టీమ్ లు.. ప్రత్యర్థులు, స్థానిక టీఆర్​ఎస్​ నేతల కార్యకలాపాలపై హైకమాండ్​కు సమాచారం చేరవేస్తున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ ఎన్నికల ఇన్​చార్జులుగా మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్​రావు బాధ్యతలు చూస్తున్నప్పటికీ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆధ్వర్యంలోనే ఈ సీక్రెట్​ ఆపరేషన్​ జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది.  

వలసలు ఆపడమే లక్ష్యంగా..!
సర్వే పేరుతో స్మార్ట్​ఫోన్లు పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్​ స్క్వాడ్​ ప్రధాన లక్ష్యం వలసలకు అడ్డుకట్టవేయడమేనని స్థానిక టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్​ నుంచి బీజేపీలోకి పెద్దసంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నేతలు క్యూ కడ్తున్నారనే అంచనాకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ వచ్చింది. ఈ వలసలను వీలైనంత కంట్రోల్​ చేయకపోతే ఓటమి ఖాయమని భావించి..  నేతల కదలికలను పసిగట్టి వలసలను ఆపేందుకు సొంత సైన్యాన్ని వాడుతున్నట్లు సమాచారం. అయితే స్థానికంగా ఉన్న లీడర్లు ఎప్పుడు బీజేపీలోకి దూకుతారో తెలియని పరిస్థితి ఉండడం వల్లే ఈ టీమ్​లలో లోకల్​ లీడర్లకు అవకాశం ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు బైపోల్ హడావుడి మొదలైనప్పటి నుంచి అసంతృప్తి గళం వినిపిస్తున్న బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్​ను టీఆర్ఎస్​ హైకమాండ్​ వ్యూహాత్మకంగా పక్కనపెడ్తున్నట్లు తెలిసింది. వాళ్ల గురించి పార్టీలో చర్చ కూడా రానివ్వడం లేదు. గౌడ సామాజిక వర్గాల లీడర్లతో నిర్వహించే సమావేశాలకు కూడా బూర నర్సయ్య గౌడ్​కు ఆహ్వానం ఉండడం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వీళ్లిద్దరినీ తిరిగి ప్రచారంలోకి దింపితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించే, దూరంగానే పెడుతున్నట్లు సమాచారం. మూడురోజుల కిందట్నే అభ్యర్థిని కూడా ప్రకటించడంతో వలసలు మరింత ఉధృతంగా ఉండొచ్చని అంచనా వేసుకున్న టీఆర్​ఎస్​ హైకమాండ్ ఆ మేరకు అసంతృప్తులపైనా నిఘా పెట్టింది. వీరితోపాటు  మునుగోడు, చౌటుప్పల్, నాంపల్లి,  నారాయాణ్ పూర్​లో పార్టీ మారుతారనే అనుమానం ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మన్సిపల్ చైర్​పర్సన్ల కదలికల పైనా కేసీఆర్​ స్క్వాడ్​ దృష్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.