
- రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
- సిటీలో భారీగా పార్టీ శ్రేణులను మోహరించే ప్లాన్
- జిల్లాల నుంచి తరలి రావాలంటూ పిలుపు
- ఏర్పాట్లు చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కవిత కామెంట్స్ తర్వాత తన స్ట్రెంత్ చూపించుకునే ప్లాన్!
- హరీశ్ తో కేసీఆర్ వరుస భేటీలు
- కమిషన్ ప్రశ్నలపై ఆరా తీస్తున్న మాజీ సీఎం
- సమాధానాలు సిద్ధం చేసుకున్నగులాబీ బాస్
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయనను కమిషన్ విచారించనుంది. వాస్తవానికి ఈ నెల 5నే విచారించాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. నిన్న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును కమిషన్ విచారించింది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలిరావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ కు చేరుకొని జిల్లాల నేతలకు ఫోన్లు చేస్తున్నారు. విచారణ జరిగే బీఆర్కే భవన్ వరకు భారీగా కార్యకర్తలు మోహరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సాగర హారాన్ని తలపించేలా..
తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సాగర హారాన్ని తలపించేలా కార్యకర్తలను మోహరింప చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ బీఆర్కే భవన్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు భారీగా జనాలు బయట ఉండేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది.
కేటీఆర్ బల ప్రదర్శనా?
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమ పార్టీలో దయ్యాలున్నాయని కవిత కామెంట్ చేశారు. కేసీఆర్ దేవుడనీ కూడా అన్నారు. కేటీఆర్ మాత్రం తమ పార్టీలో రేవంత్ కోవర్టులున్నారంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దయ్యాలెవరు..? కోవర్టులెవరు..? అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కవిత తన సొంత సంస్థ భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరూ వెళ్లలేదు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్నారు. రేపు కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెల్లెలి కంటే తనకే పార్టీ ఆమోదం ఉందని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ప్రిపరేషన్ లో కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారు. కమిషన్ అడుగుతున్న ప్రశ్నలు.. కాళేశ్వరం నిర్మాణ ఆవశ్యకత.. రీ డిజైనింగ్, లొకేషన్ల మార్పు.. నీటి లభ్యత.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ ఆవశ్యకత.. ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలేంటి..? అన్న అంశాలపై ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విచారణకు వెళ్లొచ్చిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతో నిన్న, ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. కమిషన్ ఆరా తీస్తున్న ప్రధానమైన అంశాలేంటి..? అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రేపటి ఓపెన్ కోర్టు విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.