
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను వన్ టూ వన్ విచారించారు. జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ మొదలైంది. 12 గంటల 50 నిమిషాలకు కేసీఆర్ బయటికొచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు.
ముఖ్యమైన అధికారులు, ఇంజినీర్లను, మాజీ మంత్రులు ఈటల, హరీశ్రావును ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన ఘోష్ కమిషన్.. అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విధానంలో విచారించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ ప్రధానంగా కేసీఆర్కు ప్రశ్నలు సంధించింది. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం ఎర్రవల్లి ఫాంహౌస్కు కేసీఆర్ వెళ్లిపోయారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట హరీష్ రావు, కవితతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్ వరకూ వెళ్లారు.
కమిషన్ ప్రశ్నలు..కేసీఆర్ సమాధానాలు
కమిషన్ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు .?
కేసీఆర్ : పెద్ద ప్రాజెక్టు కాబట్టి ముందుగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. టెక్నికల్ నిర్ణయాలు అన్ని వందకు వంద శాతం ఇంజనీర్లు తీసుకున్నారు
కమిషన్: బ్యారేజీలలో నీళ్లను నింపమని మీరు అదేశించారా?
కేసీఆర్ : నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు
కమిషన్ : బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారు?
కేసీఆర్ : టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్త నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయి. తుమ్మిడిహాట్టి దగ్గర బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు . మేడిగడ్డ వద్ద 230 TMC నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టుకు కావలసిన అన్ని సర్వేలు చేశాం . కేంద్రం నుంచి రావలసిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయి