
విజయవాడ: సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. కాని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జల వివాదాలకు తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లారు… ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కెసిఆర్ లు రాజకీయంగా, వ్యక్తిగతంగా సహకరించుకుంటూ విందులు చేసుకుంటున్నారే గాని ప్రజా సమస్యల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయపూర్వక వాతావరణంలో చర్చించుకోవాలని రామకృష్ణ సూచించారు.