అప్పుడు తహశీల్దార్ నాగరాజు జైళ్లో.. ఇప్పుడు మరో నిందితుడు శివుని గుళ్లో సూసైడ్
కీసర తహశీల్దార్ రూ. కోటి లంచం కేసులో మరో సంచలనం కలిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణలతో నాగరాజు అరెస్ట్ తర్వాత.. ఏసీబీ అధికారులు ధర్మారెడ్డిని మరియు అతని కొడుకు శ్రీకాంత్ రెడ్డిని సెప్టెంబర్ 26న అరెస్ట్ చేశారు. దాదాపు 33 రోజుల జైలు జీవితం గడిపిన ధర్మారెడ్డి… రీసెంట్గా బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు. కొద్దిరోజులుగా కుషాయిగూడలోని నాగార్జున నగర్ కాలనీలోనే ఉంటున్నాడు. కాగా.. ఈ ఉదయం కుషాయిగూడ పరిధిలోని, వాసవి శివనగర్లోని శివాలయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తహశీల్దార్ నాగరాజు ఇప్పటికే జైల్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ధర్మారెడ్డి బలవన్మరణం సంచలనం రేపుతోంది. ఈ కేసులోనే ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి ఇంకా బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ధర్మారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా.. ఈ కేసులో అరెస్టయిన నిందితులలో ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోవడం కలకలంగా మారింది. వీరి సూసైడ్ వెనుక పెద్ద వ్యవహారం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
For More News..