DC vs CSK: టీమిండియాలోకి రీ ఎంట్రీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న ఖలీల్ అహ్మద్

DC vs CSK: టీమిండియాలోకి రీ ఎంట్రీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న ఖలీల్ అహ్మద్

ఖలీల్ అహ్మద్.. క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయంలేకపోవచ్చు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున అదరగొట్టి టీమిండియాలో చోటు సంపాదించాడు. 2018 లో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ 25 అంతర్జాతీయ మ్యాచ్ లకే పరిమితమయ్యాడు. టీమిండియాలో వరుస అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో భారత జట్టులోనే కాదు ఐపీఎల్ లో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అయితే ఖలీల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖలీల్.. టాప్ క్లాస్ బౌలింగ్ తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం (మార్చి 31) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వీటిలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం విశేషం.   సూపర్ ఫామ్ లో ఉన్న రచీన్ రవీంద్ర ఖలీల్ బంతులను కనీసం టచ్ చేయడాకిని ఇబ్బందిపడ్డాడు. ఇతని పదునైన పేస్ ధాటికి పవర్ ప్లే లో చెన్నై 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

Also Read: ఇదెక్కడి ఆనందం రా బాబు: చెన్నై ఓడినా పండగ చేసుకున్న ఫ్యాన్స్

అంతకముందు రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక పంజాబ్ తో జరిగిన  తొలి మ్యాచ్ 43 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో ఖలీల్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియాలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చెన్నైతో మ్యాచ్ గెలిచిన తర్వాత..  "భారత్ తరఫున మరోసారి ఆడాలనేది నా అంతిమ కళ. గత ఆరు నెలల్లో చాలా మ్యాచ్ ల్లో ఆడాను. బంతిని స్వింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. చివరకు నేను అనుకున్నది సాధించగలిగాను". అని ఖలీల్ అన్నాడు   

ఖలీల్ చివరిసారిగా 2019లో వైట్-బాల్ ఫార్మాట్‌లలో టీమిండియా తరపున ఆడాడు. నిలకడ లేని కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. టీమిండియా తరపున 14 టీ20 మ్యాచ్ ల్లో 13 వికెట్లు.. వన్డేల్లో 5.81 ఎకానమీతో 11 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు.విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్  20 పరుగుల తేడాతో విజయం సాధించింది. . తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నై 171 పరుగులకే  పరిమితమైంది.