
- ప్రైవేట్ ఆస్పత్రలు నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండొద్దు
- ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్లో అక్రమాలకు తావుండొద్దు
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, వెలుగు: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లతో ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్యరంగానికి సంబంధించి చట్టాల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు అవగాహన ఉండాలన్నారు.
హెచ్ఎంఎస్, వైద్య ఖర్చుల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎంటీపీ యాక్ట్, ఐవీఎఫ్, సరోగసి నియమాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో చట్టాలపై ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు వంద శాతం క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు.
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్లో అవకతకవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకే చికిత్సకు సీఎం రిలిఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ రెండు చోట్ల క్లెయిమ్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతిని వెంటనే మార్చుకోవాలన్నారు. ఫర్టిలిటీ సెంటర్, ఐవీఎఫ్ క్లినిక్, జెనెటిక్ కౌన్సిలింగ్, నర్సింగ్ హోమ్, డయాగ్నొస్టిక్, స్పీచ్ థెరపీ లాంటి అనేక రకాల ఆస్పత్రులు వస్తున్నాయని, వీటికి పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాలు వచ్చేలా ఫైర్ క్లియరెన్స్ ఉండాలన్నారు.
ఆరోగ్యకరమైన ఖమ్మం జిల్లాను తయారు చేయడంలో ప్రైవేట్ ఆస్పత్రులు తమ సహకారం అందించాలని కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి నారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుపై హై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిని మున్సిపాలిటీల్లో అమలు అయ్యేలా చూడాలన్నారు. డీఎంహెచ్వో బి.కళావతి బాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
వైరా రిజర్వాయర్ ను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
వైరా : పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటుతో, పర్యాటకంలో జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం వైరా కేంద్రంలోని రిజర్వాయర్ పర్యాటక ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనకట్ట సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మత్స్య విత్తన క్షేత్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్స్య శాఖ విత్తన కేంద్రంలో మౌలిక వసతులను పరిశీలించారు. మత్స్యశాఖ విత్తన కేంద్రంలో పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బోటింగ్, కాటేజ్ గదులు, బిల్డింగ్ రిపేర్లకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. చెరువుల్లో చేప పిల్లలు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్య శాఖ ఏడీ శివప్రసాద్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, వైరా తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వేణు పాల్గొన్నారు.
రేపు 571 గ్రామాల్లో ఒకే రోజు పనుల జాతర
ఖమ్మం, వెలుగు: ఈనెల 22న ఖమ్మం జిల్లాలో పనుల జాతర 2025 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం, కొత్త పనులకు భూమి పూజ కార్యక్రమాలను చేపట్టేందుకు పనుల జాతర 2025 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 571 గ్రామాల్లో పనుల జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ లాంటి విభాగాల్లో చేపట్టిన, చేపట్టనున్న పనులకుప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.