ఆన్​లైన్ మనీ ట్రాన్సాక్షన్స్​పై ఫోకస్ ​పెట్టాలి : కలెక్టర్ ​వీపీ గౌతమ్

ఆన్​లైన్ మనీ ట్రాన్సాక్షన్స్​పై ఫోకస్ ​పెట్టాలి : కలెక్టర్ ​వీపీ గౌతమ్
  • ఖమ్మం కలెక్టర్ ​వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్​ఆదేశం

ఖమ్మం/ఖమ్మంటౌన్/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎన్నికల కోడ్​ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఫాలో కావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జడ్పీ మీటింగ్ హాల్ లో సీపీ విష్ణు.ఎస్.వారియర్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో, మీడియాతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. కొత్తగా ఓటరు జాబితా నుంచి తొలగింపులు ఉండవన్నారు. కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల తర్వాత ఈవీఎంలను నియోజకవర్గాలకు తరలిస్తామన్నారు. రఘునాథపాలెం మండలం జింకల తండాలో గోడౌన్లలో కౌంటింగ్​కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని సూచించారు. ఎపిక్​కార్డు రానివారు ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో  చూసుకోవాలన్నారు. సీపీ విష్ణు.ఎస్.వారియర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా15 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేశామన్నారు. పుకార్లు నమ్మవద్దని, నిజాలు తెలుసుకొని వ్యవహరించాలన్నారు. బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమాచారమివ్వాలన్నారు. అధిక మొత్తంలో విత్​డ్రా చేసినా, ఒకే అకౌంట్ నుంచి  ఎక్కువ అకౌంట్లకు అధిక మొత్తం మనీ ట్రాన్సఫర్​చేసినా చెప్పాలన్నారు. వైన్ షాపులు బేవరేజ్ నుంచి ఎంత మద్యం తీసుకుంటున్నది, అమ్మకాలకు సంబంధించిన 3 నెలల నివేదిక సమర్పించాలన్నారు.

సమావేశంలో అడిషనల్​కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అడిషనల్​డీసీపీ ప్రసాద్ రావు, జిల్లా నోడల్ ఆఫీసర్​సాయి కుమార్, రవాణాధికారి కిషన్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను సీపీ విష్ణు వారియర్ తో కలిసి జెండా కలెక్టర్​గౌతమ్​ప్రారంభించారు. 

సెక్టోరల్ ​ఆఫీసర్లదే కీలక పాత్ర

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్​గా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్​లో పోలీస్​, రిటర్నింగ్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్, సర్వెలెన్స్, వీడియో వ్యూయింగ్​ టీమ్స్, నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్​ఆఫీసర్ల పాత్ర కీలకమని చెప్పారు. ఎస్పీ డాక్టర్ ​వినీత్​ మాట్లాడుతూ.. లైసెన్స్​డ్​వెపన్స్​ఉన్నవారు సమీపం పోలీస్​స్టేషన్లలో డిపాజిట్​చేయాలని ఆదేశించారు.

చేయని వారి లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్​ ఆఫీసర్ ప్రతీక్​ జైన్​, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ కిష్టాగౌడ్​, అడిషనల్​ కలెక్టర్లు రాంబాబు, మధుసూదనరాజు, డీఆర్ఓ రవీంద్రనాథ్​, ఏఎస్పీ పరితోష్​ పంకజ్, డీఎస్పీలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​నోడల్​ఆఫీసర్లను నియమించారు.