ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం!

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం!
  • ఉమ్మడి జిల్లా గిరిజన రైతులే టార్గెట్ గా దళారుల దందా 
  • బెంగళూరు, ఏపీ నుంచి వచ్చి సీక్రెట్ గా అమ్మకాలు
  • లూజ్ విత్తనాలు అందంగా ప్యాక్​ చేసి మోసం 
  • అసలు కంటే నకిలీ విత్తనాలకే ఎక్కువ ధర 
  • ఫేక్​ సీడ్స్​కట్టడికి టాస్క్ ఫోర్స్ టీమ్ ల ఏర్పాటు 
  • ఏన్కూరు మండలంలో 564 కేజీల పత్తి గింజలు స్వాధీనం

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత కలకలం సృష్టిస్తోంది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన రైతులే టార్గెట్ గా కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్​ లోని గుంటూరు, బాపట్ల ప్రాంతాల నుంచి ఫేక్ ​సీడ్స్ ను తీసుకువచ్చి, గిరిజన తండాల్లో అమ్ముతున్నారు. స్థానికంగా కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని, వారి ద్వారా రైతులను నమ్మించి లూజ్​ విత్తనాలను వారికి అంటగడుతున్నారు. అదే తరహాలో ఏన్కూరు మండలంలో ఫేక్ సీడ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలకు ఖమ్మం జిల్లా పోలీసులు చెక్​ పెట్టారు. 

మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.14 లక్షల విలువైన 564 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను అమ్ముతున్న వారిని మాత్రమే కాకుండా, ఆ విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకొని ఆ మూలాలకు కూడా చెక్​ పెట్టారు. ఏపీలోని బాపట్ల, బెంగళూరు ప్రాంతాల్లో ఎలాంటి జర్మినేషన్​ చేయని విత్తనాలను లూజుగా తక్కువ ధరకు విక్రయిస్తుండగా, వాటిని తీసుకువచ్చి రైజోబెల్ అనే కెమికల్ ను కలిపి అరకిలో, కిలో చొప్పున వేయింగ్ మిషన్లతో ప్యాకింగ్ చేస్తున్నారు. వాటిని రైతులకు మధ్యవర్తుల ద్వారా అమ్ముతున్నారు.  

అసలు కంటే.. నకిలీకే ధర ఎక్కువ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వీటికి ఎకరానికి 2 చొప్పున 9 లక్షలకు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రకారం దేశంలో బీజీ 1, బీజీ 2 రకం విత్తనాలను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. భూసారం దెబ్బతింటుందని, వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనలతో బీజీ 3 విత్తనాలను దేశంలో సాగు చేయకుండా నిషేధించారు. వీటిని అక్రమంగా ఉత్పత్తి చేస్తున్న కొన్ని సంస్థలు, ఏజెంట్ల ద్వారా వీటిని రైతులకు నేరుగా అమ్మేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. 

అయితే బీజీ 2 రకం విత్తనాలు సాగు చేస్తే 60 రోజుల తర్వాత దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉంటుందని, బీజీ 3 రకం సాగు చేస్తే తెగుళ్ల బెడద ఉందని, కలుపు మందు కొట్టినా కూడా మొక్కలకు నష్టం ఉండదని రైతులను బ్రోకర్లు నమ్మిస్తున్నారు. కేవలం లైసెన్స్​ లేదని మాత్రమే షాపుల ద్వారా అమ్మకుండా నేరుగా రైతులకు అమ్ముతున్నామని మభ్యపెడుతున్నారు. వీటిని నమ్మిన రైతులు అసలు విత్తనాల కంటే ఎక్కువ రేటు పెట్టి మరీ ఫేక్​ సీడ్స్ ను కొంటున్నారు. బీజీ 2 రకం పత్తి విత్తనాలు 475 గ్రాములు రూ.910  అమ్ముతుండగా, ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెబుతూ నకిలీ విత్తనాలను కిలో రూ.2500 కు అమ్ముతున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, సుజాతనగర్​, కారేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, కొణిజర్ల మండలాల్లోని గిరిజన రైతులే లక్ష్యంగా చేసుకొని ఈ దందాకు పాల్పడుతున్నారు. 

లూజ్​ విత్తనాలు కొనొద్దు

మండలాల వారీగా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్​ ఫోర్స్​ టీమ్​ లను ఏర్పాటు చేశాం. అన్ని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో రెగ్యులర్​ గా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులెవరూ బ్రాండ్ సర్టిఫికేషన్​ లేకుండా విడిగా విత్తనాలు అమ్మే వారిని నమ్మవద్దు. అలాంటి విత్తనాలు ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే పోలీసులకు గానీ, వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఎట్టిపరిస్థితుల్లో లూజ్​ విత్తనాలు కొనొద్దు. 

 సునీల్ దత్, ఖమ్మం పోలీస్ కమిషనర్​