
- నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్స్తో నిఘా
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తిసాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గిట్టుబాటు ధర, కొనుగోళ్లలో ఇబ్బందులు లేకపోవడం, నష్టాలు తక్కువగా ఉండటం వల్ల నాలుగు లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. దుక్కులు దున్నుతున్నారు. రుతుపవనాలు కూడా వేగంగా పయనిస్తున్న వేళ వర్షాలు సకాలంలో కురుస్తాయన్న ఆశలపల్లకీలో ఉన్న రైతులు పెట్టుబడుల అన్వేషణలో ఉన్నారు. విత్తనాల కొనుగోలుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దీంతో వ్యవసాయశాఖ కూడా ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. విత్తనాల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
విత్తనాల కొరత లేకుండా చర్యలు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2.14లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.13లక్షల ఎకరాల్లో పంటను సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనాలు వేస్తోంది. ఖమ్మం జిల్లాకు 4.82లక్షలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు 4.82లక్షల ప్యాకెట్లు విత్తనాలు అవసరం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో 40వేలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2లక్షల ప్యాకెట్లు వివిధ డీలర్ల వద్ద విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. కాగా విత్తన కొరత రాకుండా కంపెనీలు, డీలర్లతో సమావేశం నిర్వహించి అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాకు కనీసం 10.10లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఎకరానికి 900 గ్రాముల విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తారు. ఇదిలా ఉంటే 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్లు గత సంవత్సరం రూ.864లు ఉంటే ఈసారి రూ.37 పెరిగి రూ.901కి చేరింది.
నకిలీ విత్తనాలపై దృష్టిసారించాలి
రైతులు ఈసారి పత్తిపంట వైపు మొగ్గు చూపుతున్నందున నకిలీ విత్తనాలను వారికి అంటగట్టేందుకు కొందరు రంగంలో దిగుతున్నారు. మాయమాటలు చెప్పి, ఎక్కువ దిగుబడులు వస్తాయని ఆశ చూపించి వారిని బుట్టలో వేసుకునేందుకు పన్నాగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను రక్షించాలంటే అధికారులు రంగంలోకి దిగాలి. ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ టీంలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఇప్పటికే ఈ టీమ్లు ఉన్నాయి.
అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీసు శాఖలతో గతంలో ఈ టాస్క్ ఫోర్స్ టీమ్లు పనిచేశాయి. అయితే ఇందుకు రైతులు కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లోకి విత్తనాల పేరుతో వచ్చే దళారుల వివరాలను ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలి. అప్పుడే ఈ ముప్పు నుంచి వారు కూడా బయటపడతారు. నాణ్యమైన విత్తనాల విక్రయం, రిజిస్టర్ల నిర్వహణ, ధరల వివరాలు, బ్లాక్ మార్కెట్ అదుపు తదితర అంశాలపై డీలర్లను ఆఫీసర్లు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
టాస్క్ ఫోర్స్ టీమ్స్తో నిఘా
పత్తి విత్తనాలు బ్లాక్మార్కెట్కు తరలకుండా, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలతో నిఘా పెట్టాం. జిల్లా స్థాయిలో రెండు టీంలు ఉన్నాయి. మండలస్థాయిలో ఎస్సై, తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్తో టీమ్ నిరంతరం తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలన్నీ అందుబాటులో ఉంచాం. రైతులు కూడా ఎలాంటి మోసాలకు గురికావొద్దు. ఏమైనా సలహాలు, సంప్రదింపులు అవసరమైతే తక్షణమే సమీపంలోని వ్యవసాయశాఖాధికారిని కలవాలి. మోసపోవద్దు. మేం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.
తాతారావు, ఏడీఏ, మణుగూరు