పన్నుల వసూళ్లలో టార్గెట్ చేరక.. ఫండ్స్ రాలే! మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు..

పన్నుల వసూళ్లలో టార్గెట్ చేరక.. ఫండ్స్ రాలే! మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు..
  • కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలకు ఫండ్స్​రాలే.. 
  • పన్నుల వసూళ్లను బట్టి కేంద్రం నుంచి నిధులు సాంక్షన్​
  • పన్నుల వసూళ్లలో వెనుకబడిన ఖమ్మం, కొత్తగూడెంకార్పొరేషన్లు, మణుగూరు మున్సిపాలిటీ 
  • ఖమ్మం రూ.6కోట్లు, కొత్తగూడెం రూ.2 కోట్లు, మణుగూరు రూ. కోటి ఫండ్స్​ కోల్పోయిన వైనం..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొనేషన్లతోపాటు మణుగూరు మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లలో టార్గెట్​ రీచ్​ కాకపోవడంతో  కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మున్సిపల్​ ఆఫీసర్ల నిర్లక్ష్యం ఆ మున్సిపాలిటీలకు శాపంగా మారింది. అసలే  నిధులు లేక నీరసిస్తున్న టైంలో వచ్చే నిధులనూ తెచ్చుకోలేనిదుస్థితి. 

ఇదీ పరిస్థితి... 

మున్సిపాలిటీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో టార్గెట్​ ప్రకారం పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. వసుళ్ల ఆధరంగానే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం సాంక్షన్​ చేస్తుంది. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి   టార్గెట్​ ప్రకారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలు పన్నులను వసూలు చేశాయి. దీంతో ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. 75లక్షలు, పాల్వంచ మున్సిపాలిటీకి రూ.1.85కోట్ల మేర ఫండ్స్​ ఇటీవలే రిలీజ్​ అయ్యాయి. కానీ, కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలు టార్గెట్​రీచ్​ కాకపోవడంతో15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆపేసింది. 

దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీ(ప్రస్తుతం కార్పొరేషన్​ ) దాదాపు రూ. 2కోట్లు, మణుగూరు మున్సిపాలిటీ రూ.కోటి ఫండ్స్​ను కోల్పోవాల్సి వచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్ధేశించిన పన్నుల టార్గెట్​ను కొత్తగూడెం మున్సిపాలిటీ వసూలు చేయకపోవడంతో ఈ సారి కూడా రూ.కోట్లలో నిధులు రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో టార్గెట్​ పూర్తి చేసిన సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ. 74లక్షలు, వైరా మున్సిపాలిటీకికు రూ. 74లక్షలు సాంక్షన్​ అయ్యాయి. కానీ, ఖమ్మం కార్పొరేషన్​కు పన్నుల వసూళ్లలో టార్గెట్​చేరుకోపోవడంతో దాదాపు రూ. 6కోట్ల మేర నిధులు ఆగిపోయాయి. 

ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు..  

పన్నుల వసూళ్లపై ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేయడంలో ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ ఉన్నారు. మున్సిపల్​ కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా వార్డు ఆఫీసర్లను నియమించింది. బిల్​కలెక్టర్లు ఉన్నారు. కానీ పన్నుల వసూళ్లలో ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతోపాటు మణుగూరు మున్సిపాలిటీ వెనుకబాటులో ఉండడంతో రూ. కోట్ల నిధులు రాకుండా పోయాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్​ విచారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.