బాలిక కిడ్నాప్, ముగ్గురిపై కేసు

బాలిక కిడ్నాప్, ముగ్గురిపై కేసు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని ఓ బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కుమార్  తెలిపారు. లింగాల మండలం కొత్త కుంటపల్లి గ్రామానికి చెందిన దంపతులు పట్టణంలోని ఎర్రగడ్డ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. పెద్ద అమ్మాయికి మూగ, చెవుడు ఉంది. బాలిక చిన్నమ్మ అనిత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంపై బాలిక తల్లి పలుమార్లు ప్రశ్నించింది. దీనిని మనసులో పెట్టుకొని మంగళవారం రాత్రి అనిత తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి బాలికను కిడ్నాప్ చేసి పట్టణంలోని ఎర్రగడ్డ కాలనీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఎర్రగడ్డ కాలనీలో పాడు బడిన ఇంట్లో నుంచి బాలిక బయటకు రావడంతో పోలీసులు గుర్తించి స్టేషన్ కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్​కు పాల్పడిన ముగ్గురిపై పోక్సో, నిర్భయ, కిడ్నాప్  కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.