ఆస్పత్రిని కరోనా పేషెంట్ల కోసం వాడుకోవాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు ఓ దవాఖానను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్లోని కింగ్ కోఠి దవాఖానాను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆ దవాఖానాలో ఇప్పటికే ఉన్న పేషెంట్లను సమీపంలోని ఇతర దవాఖానాలకు షిఫ్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ హాస్పిటళ్లకు పదుల సంఖ్యలో అనుమానితులు వస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే గాంధీకి 126 మంది వచ్చారు. ఇందులో 26 మందిని ఐసోలేషన్లో ఉంచి, శాంపిల్స్ సేకరించారు. ఇప్పటివరకూ పాజిటివ్గా గుర్తించిన 27 మందిని గాంధీ, చెస్ట్ హాస్పిటళ్లలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైరస్ ఇతరులకు సోకకుండా ఆ దవాఖానాల్లో చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాటికి వచ్చేందుకు పేషెంట్లు భయపడుతున్నారు. రోజు రోజుకూ ఓపీ తగ్గిపోతోంది. ఇదే సమయంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
విదేశాల నుంచి వచ్చినోళ్లపై ఆరా
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఈటల రాజేందర్, కమిటీ సభ్యులు, హెల్త్ ఆఫీసర్లు భేటీ అయ్యారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఏం చేయాలన్నదానిపై ఆరా తీశారు. మార్చి ఒకటి తర్వాత విదేశాల నుంచి వచ్చినోళ్ల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, వీఆర్వో, ఆశ వర్కర్, పోలీస్ కానిస్టేబుల్తో టీమ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లిన వారి వివరాలను సేకరించి, వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరైనా ఇండియాకు వచ్చి, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోతే ఇంటెలిజెన్స్కు సమాచారం చేరవేస్తున్నట్టు వివరించారు.
ఏ జిల్లా పేషెంట్ ఆ జిల్లాలోనే..
కరోనా అనుమానితులను హైదరాబాద్ కు తరలించొద్దని ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఆయా జిల్లా దవాఖాన్లలో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అనుమానితులను ఆ దవాఖాన్లకు తరలించి, శాంపిళ్లను మాత్రమే హైదరాబాద్ కు పంపించాలని మంత్రి జిల్లాల హెల్త్ ఆఫీసర్లకు సూచించారు. ఒకవేళ అందులో ఎవరైనా పాజిటివ్ వస్తే.. ఆ పేషెంట్ను హైదరాబాద్కు తరలించాలని ఆదేశించారు. అలాగే కరోనా టెస్టుల కోసం ఎవర్ని రిఫర్ చేయాలన్న దానిపై నిపుణుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించి, ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది.
For More News..
