
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ఆకట్టుకోగా, ఏప్రిల్ 7న ‘మీటర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతలోనే మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు కిరణ్. విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. ముహూర్తపు షాట్కి డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఏ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు. కె.ఎస్.రామారావు, శిరీష్, దామోదర ప్రసాద్, జెమిని కిరణ్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. ఇదొక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా అని, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు నిర్మాతలు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.