మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి కౌంటర్

మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి కౌంటర్

మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరోనా టీకా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి, తీసుకున్న చొరవ భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి చాలా బాగా తెలుసని కిషన్ రెడ్డి అన్నారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం వివిధ రంగాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నందుకు గాను నోబెల్ బహుమతులు ఇవ్వాల్సిందే అంటూ ట్వీట్ చేశారు. కరోనా వ్యాధి చికిత్సకు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నందుకు వైద్యరంగంలో కేసీఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు. అలాగే.. 80 వేల పుస్తకాలు చదివినందుకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ మరో ట్వీట్ చేశారు. అర్థం లేని అబద్ధాలను సృష్టించడంలో..  విచ్చలవిడిగా అవినీతి చేయడంలో..  ఇలా వివిధ రంగాలకు గాను నోబెల్ బహుమతి తీసుకునే అర్హత ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. 
 

 

ప్రధాని నరేంద్రమోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని.. ఆస్కార్ కాకపోయిన భాస్కర్ అవార్డు ఇవ్వాలని అన్నారు. ప్రధాని మోడీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూపాయి విలువ తగ్గింపు పై 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన మోడీని నోబెల్ పురస్కారాలకు నామినేట్ చేయాలనుకుంటున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.