
దోపిడీ చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపి ఎమ్మేల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బాగంగా నిర్వహించిన గిరిజన మోర్చా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం, పేదల గూర్చి పట్టించుకోదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు వాతలు పెట్టాల్సిన అవసరముందని, బీఆర్ఎస్ పార్టీని పాతరేయాల్సిన అవసరముందని విమర్శించారు. వాస్తు బాలేదని పాత సెక్రటేరియెట్ కూలగొట్టాడని... కొత్త సెక్రటేరియెట్ కు కూడా రావడం లేదన్నారు.
పదేండ్ల నుండి సెక్రటేరియెట్ కు రాని కేసీఆర్..ఇక పర్మనెంట్ గా ఫాంహౌజ్లో ఉండేలా చేయాలన్నారు. గతంలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగాలని, ఆత్మగౌరవంతో బతకాలని ఉద్యమం చేశామన్నారు. ఓటుకు మించిన ఆయుధం ప్రపంచంలో లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటును డబ్బుచూపించి, బెదిరించి కొనాలనుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి కచ్చితంగా బుద్దిచెప్పాల్సిన అవసరముందన్నారు. ఈ ఎన్నికల్లో అందేల శ్రీరాములును గెలిపించాలని కోరారు. తాను ఇక్కడనే పుట్టానని ఇక్కడే చనిపోతానని తనను ఆశీర్వదించి గెలిపించాలని బీజేపి ఎమ్మేల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు కోరారు. పోటీలో ఉన్న ఇతరులు స్థానికేతరులని తెలిపారు.