
- తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ పాత్ర కీలకమన్న కేంద్రమంత్రి
- హైదరాబాద్లో ప్రవాసీ తెలంగాణ దివస్
హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో సర్కార్ స్కూళ్ల డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్ – యూఎస్ఏ) 6వ ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్రమం జరిగింది. దీనికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీఎఫ్ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రంలోని పల్లెల్లో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరిస్తోందని అభినందించారు. తెలంగాణ గురించి మాట్లాడే, ప్రశ్నించే ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్లలో టీడీఎఫ్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. రాష్ర్టం ఏర్పడినంక డెవలప్ మెంట్ పై ఎన్నో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు పరిశోధనలు చేసిందన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం: ఎర్రబెల్లి
రాష్ట్రం ఏర్పడినంక పల్లెలన్నీ డెవలప్ అయ్యాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భూముల ధరలు భారీగా పెరిగాయని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని తెలిపారు. వారు విదేశాల్లో ఉన్నప్పటికీ, సొంతూరును మరిచిపోలేదన్నారు. ఉద్యమం టైమ్ లో టీడీఎఫ్ ను ఏర్పాటు చేసి కీలకంగా పని చేశారన్నారు. తెలంగాణ సమస్యలపై చర్చించడానికి అమెరికాలో టీడీఎఫ్ను స్థాపించడం గొప్ప ప్రయత్నమన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ కు టీడీఎఫ్ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ఎన్ఆర్ఐలు ప్రశ్నించాలని కోరారు. కాగా, ఈ సందర్భంగా టీడీఎఫ్ తరఫున రాష్ట్రంలోని స్కూళ్ల డెవలప్ మెంట్ కు రూ.3.75 లక్షలను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి , టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, సభా అధ్యక్షురాలు కవిత చల్లా, టీడీఎఫ్–యూఎస్ఏ ప్రెసిడెంట్ ప్రీతి చల్లా, వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు కేంద్రం అండ
దివ్యాంగులకు అన్ని విధాలుగా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని బౌద్ధ నగర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగులకు, వృద్ధులకు ఫ్రీగా సహాయ పరికరాలు అందించేందుకు ఏర్పాటు చేసిన అర్హుల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే అర్హులను గుర్తించి వారికి ఉపయోగపడే పరికరాలను తయారు చేయించి పంపిణీ చేస్తామని తెలిపారు. కాళ్లు, కళ్లు, దంతాలు, చేతి కొలతలు తీసుకుని అందుకు అనుగుణంగా వస్తువులు, పరికరాలను తయారు చేసి అందిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. దివ్యాంగుల రిజర్వేషన్లను 4 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిందని
తెలిపారు.