
కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలన చూశారు.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలన చూశారు.. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వండని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సహకారంతో పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక మాఫియా చేతిలో బంధి అయిందని ఆరోపించారు. ఒక అవినీతి కుటుంబం చేతిలో తెలంగాణ ఉందని.. నివురు గప్పిన నిప్పులా తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు.
ఓ వర్గం మీడియా కూడా అజెండాతో బీజేపీపై అసత్య వార్తలు రాస్తుందని... సోషల్ మీడియాలోనూ బీజేపీపై అసత్య ప్రచారం జరుగుతుందని అన్నారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచి.. బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తుంది... ఈ విషయంలో బీజేపీ కాంప్రమైజ్ కానే కాదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేద్దామన్నారు.
Also Read :- సీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం
రాహుల్ గాందీ.. రాజకీయ అజ్ఞాని అని, నీచ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. దేశంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. బిఆర్ఎస్ కు బీజేపీ బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీ బీ టీమ్.. బీజేపీ ప్రజల టీమ్ అని అన్నారు. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ అని... కెసిఆర్ పార్టీ కొనుగోలు చేసే పార్టీ అని ఆరోపించారు. మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి కెసిఆర్ పార్టీలో చేరింది మీ ఎమ్మెల్యేలు.. రాహుల్ గాంధీ తెల్సుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.