సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో, 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. "తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలకు కూడా ESI వైద్య సేవలను విస్తరించడానికి కేంద్ర కార్మిక శాఖ ఎన్నో చర్యలు చేపట్టిన విషయం విదితమే.

ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో కీలకమైన రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESI) 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించింది. ఆ మేరకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESI) కేంద్ర కార్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ 20.09.2018 న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
  
తదనంతరం ESIC ప్రాంతీయ కార్యాలయం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే భూమి కేటాయించాలని ఉత్తరాల ద్వారా కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అంతే కాదు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ESIC ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల మే నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశలో కూడా రామగుండంలో 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించడం జరిగింది.

కాబట్టి భూ కేటాయింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే రామగుండం ESI  ఆసుపత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.