కోల్కతా: ఐపీఎల్ 19 సీజన్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ టీమ్ పేసర్ ఆకాశ్ దీప్ వెన్నునొప్పి కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుందని సమాచారం. దీంతో జూన్లో అఫ్గానిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్ తరపున ఆడిన ఆకాశ్ దీప్.. పూర్తి ఫిట్నెస్తో లేనట్లు కనిపించాడు. అప్పటినుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. కేకేఆర్ ఇప్పటికే హర్షిత్ రాణా సేవలను కోల్పోగా.. శ్రీలంక బౌలర్ మతీషా పతిరాణ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇప్పుడు ఆకాశ్ దూరం కావడం ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది. ఆకాశ్ దీప్కు రీప్లేస్మెంట్గా ఆకాశ్ మధ్వాల్, నవదీప్ సైనీ, సందీప్ వారియర్ వంటి ప్లేయర్లను పరిశీలిస్తోంది.
