- కేసీఆర్ పాపాలను కడగాలంటే బ్యారల్ ఫినాయిల్ కావాలి : కోదండ రెడ్డి, జగ్గారెడ్డి
- కేటీఆర్ శాఖలోని అక్రమాలకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్లో భూముల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కిసాన్ కాంగ్రెస్జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్పాపాలు, లోపాలను కడగాలంటే ఫినాయిల్ బ్యారళ్లు కావాలని ఎద్దేవా చేశారు. ధరణి సమస్యలపై అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే అయ్యిందని వారు విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలే చేశారని..
కానీ, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నదని కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్నారని ఆరోపించారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఎక్కడా అంటూ ఓ మాజీ మంత్రి అడుగుతున్నారని.. ఎంఎస్ పీ కంటే తక్కువ వస్తే బోనస్ ఇస్తామన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని గుర్తుచేశారు. రైతులు క్వింటాల్ ధాన్యాన్నిరూ.2,600 కు అమ్ముతున్నారని ఆయన తెలిపారు. పంటరుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర తమదేనని, ఇప్పుడు కూడా ఒకేసారి చేస్తామని చెప్పారు. హెచ్ఎండీఏలో చిన్న అధికారిని పట్టుకుంటే ఐఏఎస్ల పేర్లు చెప్తున్నారు..
ఈ శాఖ కేటీఆర్ వద్దే ఉండేది కాబట్టి దీంట్లో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా సిటీ భూముల సమస్యలన్నింటి పై కోదండ రెడ్డి కొట్లాడారని, అలాగే ధరణిలో అవకతవకలు కూడా బయటకు తీయాలన్నారు. తొమ్మిదేండ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటల చర్చ జరిగిందని
సంప్రదాయం పాటించని పార్టీ బీఆర్ఎస్అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలని సీఎం అడిగే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సమావేశంలో ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టుసాయి, దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం తదితరులు పాల్గొన్నారు.