అవసరమైతే ఫీల్డ్ విజిట్: ధరణి కమిటీ

అవసరమైతే ఫీల్డ్ విజిట్: ధరణి కమిటీ
  • ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం
  • మార్పులు, చేర్పులపై 22న మూడో మీటింగ్
  • అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదికి ఇస్తం
  • ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి

హైదరాబాద్: ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు. ఇవాళ సచివాలయంలో ధరణిలో పోర్టల్, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై కమిటీ రెండో సమావేశం జరిగింది.  

ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించిందని కోదండ రెడ్డి చెప్పారు. ఎంతకూ తెగని భూముల పంచాయితీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుందన్నారు.

ధరణి సాఫ్ట్ వేర్ ఏమిటి? ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పులపైనా కమిటీ సమగ్రంగా రిపోర్ట్​ తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి పరిష్కార మార్గాలు కనుగొంటామని అన్నారు.

సోమవారం రోజున  కమిటీ మూడో సమావేశం సీసీఎల్ ఏ ఆఫీసులో జరుగుతుందని, ఆ రోజు తాము తీసుకోబోయే చర్యలపై వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు.  సమావేశంలో ధరణి కమిటీ కన్వీనర్‌గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ , మాజీ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్‌, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.