
హైదరాబాద్, వెలుగు : ఫార్మా సిటీపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అబద్ధాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎక్కువ సీట్లు రాకపోవడంతో బిత్తరపోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నాని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
‘‘హైదరాబాద్ గ్రీన్ సిటీ, ఫార్మా సిటీ పేరుతో రైతుల దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షలకు భూములు కొని ఎక్కువ రేట్లకు అమ్ముకున్నది. ఫార్మా సిటీతో ప్రజలు, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని కాంగ్రెస్ ముందు నుంచీ చెప్తున్నది. అందువల్ల ఫార్మా సిటీని ఒక్క దగ్గర కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో పెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఫార్మా సిటీపై ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది’’ అని పేర్కొన్నారు.