మన నీళ్లు ఏపీ ఎత్తుకుపోతుంటే కేసీఆర్ నీళ్లు నములుతున్నారు

మన నీళ్లు ఏపీ ఎత్తుకుపోతుంటే కేసీఆర్ నీళ్లు నములుతున్నారు

పోతిరెడ్డిపాడుతో మన నీళ్ళను దొంగిలించేందుకు ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుంటే.. మన సీఎం కేసీఆర్ మాత్రం నీళ్లునములుతూ కూర్చున్నారని, దీనికి కారణం జగన్ తో ఆయనకు ఉన్న లోపాయికారీ ఒప్పందమేనని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రధాన కార్యదర్శివెంకటరెడ్డి ఆరోపించారు. సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మంటగలపడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని మండిపడ్డారు. అపెక్స్మీటింగ్ ను ఈ నెల 5 నుంచి ఈ నెల 20కి మార్చాలనడం వెనుక కుట్ర ఇదే అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గ్యాప్ లో టెండర్లప్రక్రియ ముగియడం, పని మొదలు పెట్టడం ఏపీ ప్రభుత్వం చేస్తుందని, ఇందులో జగన్ కు కేసీఆర్ సహకరించడం కోసమే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేయాలని కోరారని ఆరోపించారు. జులై 15న టెండర్లు ముగిసినా మేఘా కృష్ణా రెడ్డికి ఈ ప్రాజెక్టు కట్టబెట్టడం కోసమే, వాటి ద్వారా వచ్చే ముడుపుల కోసమే జగన్, కేసీఆర్ కలిసిపోయారని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి

బిజీగా ఉన్నామని సీఎం చెప్పడం ఒక మోసమని.. సెక్రటేరియట్ తప్ప మిగతా ఏ అంశాలపై ఆయన స్పందించడం లేదని కోదండరాం, వెంకటరెడ్డి మండిపడ్డారు. ఏం మునిగిపోయే పనులు ఉన్నాయని అపెక్స్ మీటింగ్ను వాయిదా వేయాలని కోరారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. మీటింగ్కు అటెండ్ కావాల్సింది అధికారులే కానీ, సీఎం కాదు కదా అని గుర్తు చేశారు. ఇదంతా నీటి దోపిడీకి ఆంధ్రాకు కేసీఆర్ సహకరించడమేనని, దాని వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అపెక్స్ మీటింగ్ ను తప్పించుకునేందుకే కేబినెట్ భేటీ