ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఇంటిలో ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు కోడెల. దీంతో ఆయన్ను బసవతారం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. కొన్నాళ్లుగా కేసులు చుట్టుముట్టడంతో మనస్తాపం చెందిన ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
1947 మే 2న గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో జన్మించారు కోడెల శివప్రసాదరావు. వైద్య విద్య పూర్తి చేసిన ఆయన 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలయ్యారు. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి టీడీపీ తరపున విజయం సాధించారు. నవ్యాంధ్ర తొలి శాసన సభ స్పీకర్ గా 2019 వరకు సేవలందించారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.
కొడెల కొన్ని రోజులుగా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోడెలతో పాటు ఆయన కుమారుడు, కూతురు కూడా పలు కేసుల్లో చిక్కుకున్నారు. చాలా కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో కోడెలపై విమర్శలొచ్చాయి. ఏపీ సర్కార్ కేసు కూడా పెట్టింది.