
ఐపీఎల్2023లోమాజీ కెప్టెన్..కూల్ కెప్టెన్ మధ్య పోరుకు అంతా సిద్దమైంది. బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైట్ జరగబోతుంది. గురు శిశ్యుల పోరులో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ మ్యాచులో పలు రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.
కూల్ రికార్డు...
ఆర్సీబీపై బ్యాటింగ్ చేయాలంటే ధోనికి మహా ఇష్టం. అందుకే ఆర్సీబీపై ధోని చెలరేగి ఆడతాడు. ఇదే క్రమంలో ఐపీఎల్లో బెంగుళూరుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించేందుకు ధోనీ రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ధోని ఆర్సీబీపై 31 ఇన్నింగ్స్ లో 39.90 సగటు, 140 స్ట్రైక్ రేటుతో 838 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచులో ధోని మరో రెండు పరుగులు చేస్తే .. ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా ధోని రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. ఆర్సీబీపై వార్నర్ 839 పరుగులు సాధించాడు.
కోహ్లీని ఊరిస్తున్న రికార్డు..
చెన్నై అంటే కూడా కోహ్లీకి ఇష్టమే. ఈ టీమ్పై పరుగులు సాధించేందుకు కోహ్లీ తహతహలాడుతూ ఉంటాడు. ఈ ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో మూడు అర్థ సెంచరీలు సాధించాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో చెన్నైపై కోహ్లీ 29 ఇన్నింగ్సుల్లో 39.16 సగటుతో 979 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ 21 పరుగులు చేస్తే..సీఎస్కేపై వెయ్యి పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్పై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.
రహానే కూడా..
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగే మ్యాచులో అజింక్య రహానే కూడా ఓ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. రహానే ఇప్పటి వరకు తన కెరీర్ లో 219 టీ20లు ఆడి..5732 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 595 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ మ్యాచులో రహానే మరో ఐదు ఫోర్లు కొడితే.. టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పుతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కుతాడు.