
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి వరల్డ్ వైడ్ భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అతని ఆట చూసేందుకు విదేశాల్లోనూ ఎంతో మంది స్టేడియాలకు వస్తుంటారు. తనను కలిసేందుకు, ఫొటో దిగేందుకు పోటీ పడుతుంటారు. అయితే కొందరికే ఆ అవకాశం, అదృష్టం లభిస్తుంది. తాజాగా ఓ మహిళకు ఈ లక్కీ చాన్స్ దక్కింది. తాను ఎంతగానో అభిమానించే విరాట్ కండ్ల ముందుకు రావడంతో పట్టరాని ఆనందంతో అతడిని హత్తుకొని, ముద్దు పెట్టింది. తన అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.కోహ్లీ కూడా ఆమెను ఎంతో ఆప్యాయంగా పలుకరించాడు. ఆమె అడగ్గానే ఫొటో దిగాడు. ఆ మహిళ కుమారుడు ఈ ఇద్దరినీ ఫోటో తీశాడు. ఫొటో తీసిన వ్యక్తి వెస్టిండీస్ యంగ్ క్రికెటర్, కీపర్ జోషువా డసిల్వ కాగా.. కోహ్లీని చూడగానే అంత ఎమోషనల్ అయిన ఆ మహిళ అతని తల్లి కావడం విశేషం. వెస్టిండీస్, ఇండియా మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ సందర్భంగా కీపింగ్ చేస్తున్న జోషువా.. ‘మా అమ్మ నాకు ఫోన్ చేసి మీ ఆట చూసేందుకే స్టేడియానికి వస్తున్నానని చెప్పింది’ అని కోహ్లీతో అనడం స్టంప్ కెమెరాలో రికార్డైంది. దాంతో, ఆట ముగిసిన తర్వాత జోషువా తల్లిని కోహ్లీ కలుసుకున్నాడు. జోషువా, తాను విరాట్ను ఆరాధిస్తామని ఆమె చెప్పింది. కోహ్లీని కూడా తన కొడుకులానే భావిస్తానని వెల్లడించింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ తర్వాత విరాట్ కోహ్లీకి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో మరోసారి రుజువైంది.