(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై, సీఎస్కే తర్వాత అత్యధికంగా మూడు టైటిళ్లు నెగ్గిన టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో 2024లో మూడోసారి విజేతగా నిలిచిన ఆ జట్టు గతేడాది డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి బోల్తా కొట్టింది. తమకు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ను వదులుకున్న తర్వాత అన్నింటా విఫలమై 8వ స్థానంతో సరిపెట్టుకున్న కేకేఆర్ మళ్లీ మునుపటి వైభవాన్ని తిరిగి తీసుకురావాలని పట్టుదలగా ఉంది. పాత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ, రికార్డు స్థాయి కొనుగోళ్లు, కొత్త కోచింగ్ స్టాఫ్తో సరికొత్త శకానికి నాంది పలికేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (రూ. 25.20 కోట్లు) పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన కామెరాన్ గ్రీన్ రాక కేకేఆర్కు ఈసారి అతిపెద్ద అడ్వాంటేజ్ కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అతను జట్టుకు బ్యాలెన్స్ తీసుకురానున్నాడు. హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ ప్రమోషన్ పొందడం, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలు కోచింగ్ స్టాఫ్లో చేరడం వల్ల జట్టు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఒత్తిడి సమయాల్లో అతని నిర్ణయాలు, వ్యూహాలపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ఈ నెల29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో కొత్త సీజన్ ఆరంభిస్తున్న కేకేఆర్ నాలుగో టైటిల్ నెగ్గుతుందా? చూడాలి
బలాలు
ఈ సారి కేకేఆర్ టాపార్డర్ చాలా బలంగా ఉంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్ రాకతో బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. వీరికి తోడుగా సునీల్ నరైన్ కూడా ఉండటంతో ప్రత్యర్థి బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడే అవకాశం ఉంది. కేకేఆర్ ఎప్పటిలాగే తమ స్పిన్ విభాగంపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వరల్డ్ కప్లో 13 వికెట్లు పడగొట్టి భీకర ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తికి తోడు, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ప్రత్యర్థులకు సవాల్ విసరనున్నాడు. ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర చేరికతో, స్పిన్కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యర్థి జట్లను ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేకేఆర్ మరింత బలపడింది.
బలహీనతలు
కీలక పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్కు దూరం అవ్వడం జట్టుకు భారీ ఎదురుదెబ్బ. గాయం నుంచి కోలుకుంటున్న శ్రీలంక పేసర్ మతీషా పతిరణ ఏప్రిల్ రెండో వారం వరకూ అందుబాటులో ఉండటం లేదు. దాంతో కామెరాన్ గ్రీన్తోపాటు వైభవ్ అరోరా, ఆకాశ్ దీప్, టీ20 వరల్డ్ కప్లో ఆకట్టుకున్న జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పేస్ బౌలింగ్ విభాగానికి కీలకం కానున్నారు. ఇక, వెస్టిండీస్ డ్యాషింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ లేకపోవడంతో ఇప్పుడు మ్యాచ్ను ముగించే బాధ్యత పూర్తిగా రింకూ సింగ్పైనే పడింది. ఒకవేళ రింకూ లేదా రోవ్మన్ పావెల్ విఫలమైతే చివర్లో వేగంగా రన్స్ రాబట్టే ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
హర్షిత్ పేస్, రస్సెల్ అనుభవం లేకపోవడంతో స్లాగ్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడం కేకేఆర్కు కత్తిమీద సాములా మారనుంది. ఇక, కేకేఆర్ తమ తొలి మ్యాచ్ను వాంఖడే స్టేడియంలో ఆడనుంది. ఇక్కడ ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఒకవేళ తొలి మ్యాచ్లోనే ఓడిపోతే, అది కొత్త ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుంది.
కేకేఆర్ టీమ్
అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్మన్ పావెల్, ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్, తేజస్వి సింగ్, సునీల్ నరైన్, కామెరాన్ గ్రీన్, రచిన్ రవీంద్ర, అనుకుల్ రాయ్, రమణ్దీప్ సింగ్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, మతీషా పతిరానా, బ్లెస్సింగ్ ముజరబానీ.
