- మీడియాతో చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- కేటీఆర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్
- కేసీఆర్ను ప్రజలే నామరూపాలు లేకుండా చేసిన్రు
- త్వరలో యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే హరీశ్రావు కూడా బీజేపీలోకి వెళ్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేటీఆర్ ఇప్పటికీ తండ్రీ చాటు కొడుకేనని ఎద్దేవా చేశారు. ‘‘నేను కేటీఆర్ లా తండ్రి పేరుతో రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమాలు చేసి వచ్చాను. కేటీఆర్ ది జీరో నాలెడ్జ్. ఏమాత్రం నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్” అని అన్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన చీఫ్డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు పోలేదు? కాళేశ్వరం పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రిపోర్టు ఇచ్చారు. కేసీఆర్ ను ప్రజలే నామరూపాలు లేకుండా చేశారు” అని ఆయన అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెప్పామని.. భువనగిరి, నల్గొండ, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్ కు సౌత్ ఇండియాలోనే టాప్ మెజార్టీ వస్తుందని తెలిపారు. మోదీ కంటే రాహుల్యే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. యాదాద్రి పేరును త్వరలోనే యాదగిరిగుట్టగా మారుస్తూ జీవో ఇస్తామని మంత్రి ప్రకటించారు.