- తెలంగాణలో కాంగ్రెస్ కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నది
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి బహుమతిగా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎంగా ఎంపికవడం హర్షణీయమన్నారు. సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని తెలిపారు. ‘‘కాంగ్రెస్లో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ మా పార్టీలో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది నిజం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, హైకమాండ్కు తీర్మానం పంపారు. పార్టీలో ప్రజాస్వామ్యానికి, ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రాధాన్యానికి ఇది సంకేతం” అని చెప్పారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందని అన్నారు. ప్రజాస్వామిక, ప్రజా అనుకూల ప్రభుత్వ పాలన రాబోతున్నదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు.