మంత్రులను అడ్డుకున్న కొండగట్టు ప్రమాద బాధితులు

మంత్రులను అడ్డుకున్న కొండగట్టు ప్రమాద బాధితులు

జగిత్యాల : కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట- రామ్ సాగర్ గ్రామాల సరిహద్దులో మంత్రులను అడ్డుకున్నారు గ్రామస్థులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడిమ్యాల మండలం హిమ్మత్ రావుపేట గ్రామంలో జరిగే గ్రామ సభలో పాల్గొనేందుకు మంత్రులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్ వచ్చారు. రాంసాగర్  గ్రామంలో మంత్రి  కాన్వాయ్ ని అడ్డుకున్నారు కొండగట్టు ప్రమాద బాధితులు,రైతులు. కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగి ఏడాది పూర్తైనా… గాయపడిన వారికి ఇంకా పరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మంత్రులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డును బ్లాక్ చేసి ధర్నా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వచ్చే నీటితో తమ చెరువుల్లోకి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని మంత్రులు కోరినా.. గ్రామస్తులు వినలేదు. నినాదాలు చేశారు.

ఇదే సమయంలో… చేతిలోకి పిస్టల్ తీసి పట్టుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్కార్ట్ డ్యూటీ ఎఆర్ ఎస్సై. అక్కడున్న వారు దీనిపై అభ్యంతరం తెలిపారు. రెచ్చగొట్టేలా ఇలా తుపాకీ చేతిలో పట్టుకోవడంతో గ్రామస్తులు  తగ్గకపోగా.. నిరసన తీవ్రత పెంచారు.

గ్రామస్తులకు సాయం చేస్తామని… డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రులు చేతులు జోడించి విజ్ఞప్తిచేయడంతో.. ఆందోళన విరమించారు గ్రామస్తులు.

హిమ్మత్ రావు పేట గ్రామ సభ అనంతరం వచ్చిన దారిలో కాకుండా మరో దారిలో జగిత్యాలకు బయలుదేరి వెళ్లిపోయారు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.