- పర్సంటేజ్ ఇస్తేనే మార్కింగ్ చేస్తానంటున్నడు
- ప్రజాప్రతినిధిని కలిసి మాట్లాడాలట
- ఆరు శాతం కమిషన్ ఇవ్వాల్నట
- కొత్తగూడెం ఎస్పీకి కాంట్రాక్టర్ కంప్లయింట్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సాక్షాత్తు పోలీస్ బెటాలియన్ క్యాంపు గోడ కట్టడానికి కావాల్సిన మార్కింగ్ చేయడానికి స్థానిక డీఈ పర్సంటేజీ అడుగుతున్నారని ఎస్పీకి కంప్లయింట్ చేశాడో కాంట్రాక్టర్. ప్రజాప్రతినిధితో మాట్లాడుకొని వచ్చిన తర్వాతే పని చేస్తానంటూ డీఈ చెబుతున్నాడని వాపోయాడు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ పోలీస్ బెటాలియన్ క్యాంపు ప్రహరీగోడ నిర్మాణానికి మూడు నెలల కింద పంచాయతీ రాజ్అధికారులు టెండర్లు పిలిచారు. రూ. 1.80 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కొండల్ అనే కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. టెండర్ ఫైనలై మూడు నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ఎస్పీ డాక్టర్ వినీత్...కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన అసలు విషయం బయటపెట్టాడు. డీఈ సత్యనారాయణ పనికి సంబంధించిన మార్కింగ్ ఇవ్వలేదని, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధిని కలిసి వచ్చిన తర్వాతే మార్కింగ్ ఇస్తానంటూ తిప్పించుకుంటున్నాడని వివరించాడు. ఆ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు ఆరు శాతం కమీషన్ అడుగుతున్నారని చెప్పాడని, తాను ఇవ్వలేనని చెప్పినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో సతాయిస్తున్నాడని వాపోయాడు. ఎవరితోనైనా అడిగిస్తే జంగిల్ కటింగ్ చేయలేదని అందుకే మార్కింగ్ ఇవ్వడం లేదని చెబుతున్నాడని, సైట్ చూయించకుండా తాను జంగిల్ కటింగ్ ఎలా చేస్తానని ప్రశ్నించాడు. తన టెండర్ రద్దు చేసినా బాధ లేదంటూ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎస్పీ..కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
అందుకే మార్కింగ్ చేయలే...
తాను ఎటువంటి కమీషన్ అడగలేదని డీఈ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ప్రజాప్రతినిధిని కానీ, వారి కుటుంబసభ్యులను కలవాలని తాను ఎందుకు చెబుతానని అన్నారు. కాంట్రాక్టర్ జంగిల్కటింగ్ చేయకుండా ఆలస్యం చేశాడని అందుకే మార్కింగ్ ఇవ్వలేదన్నారు. జంగిల్ కటింగ్ రెండు రోజుల కిందే పూర్తయ్యిందని, మార్కింగ్ ఇస్తానని కాంట్రాక్టర్కు చెప్పానన్నారు. అయినా కాంట్రాక్టర్ కావాలని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.