
హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నామినేషన్ అఫిడవిట్లో భార్య పేరు ప్రస్తావించనంత మాత్రాన కూనంనేని ఎన్నిక చెల్లకుండా పోదని తేల్చి చెప్పింది. భార్యకు చెందిన అయిదేండ్స ఆదాయపు పన్ను రిటర్న్లు, ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారని.. కేవలం పేరు వెల్లడించనంత మాత్రాన ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై గెలుపొందారు.
కూనంనేని నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వాస్తవాలు వెల్లడించనందున ఎన్నికను రద్దు చేయాలంటూ ఓటరు నందూలాల్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించారు. నామినేషన్ సందర్భంగా భార్య పేరు వెల్లడించకపోవడంపై పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అయినా మరో అభ్యర్థి జలగం వెంకటరావు ఇదే విషయంపై అభ్యంతరం లేవనెత్తినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారన్నారు.నిబంధనల ప్రకారమే నామినేషన్ ఉండటంతో రిటర్నింగ్ అధికారి దాన్ని ఆమోదించారని చెప్పారు. సరైన ఆధారాలను సమర్పించకపోవడంతో పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.