కొవిడ్ రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే వనమా

కొవిడ్ రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం: కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ రూల్స్‌‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు మాత్రం నిబంధనలు వర్తించడం లేదు. ఏదైనా కార్యక్రమాన్ని 50 మందితోనే చేయాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వనమా క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల తర్వాత కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రోగ్రామ్‌‌కు పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్‌‌తో కలిపి సుమారు 200 మందికి పైగానే హాజరుకావడం గమనార్హం. 

గతేడాది వనమా తనయుడు రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి అనేక మందికి కరోనా సోకడానికి కారణమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడూ అదే తరహాలో సమావేశాలు ఏర్పాటు చేయడంపై అధికారులు చూసీచూడనట్లు వ్యహరించడం మీద పలువురు సీరియస్ అవుతున్నారు. లాక్‌‌డౌన్ నియమాలు కేవలం సామాన్యులకేనా అని ప్రశ్నిస్తున్నారు.