- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వడ్డీలేని రుణాలతో మహిళల్లో ఆర్థికాభివృద్ధి పెరుగుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం నిర్వహించిన వడ్డీలేని రుణాల పంపిణీ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 304కోట్ల వడ్డీలేని రుణాలను ప్రభుత్వం విడుదల చేయడం అభినందనీయమన్నారు. రుణాలను క్రమశిక్షణతో చెల్లించడం వారి దక్షతకు అద్దం పడుతోందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లు వంటి వాటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మహిళలను వ్యాపార వేత్తలకు తీర్చిదిద్దుతోందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లతో పాటు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తొందన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాకు రూ. 10.74కోట్ల వడ్డీలేని రుణాలు సాంక్షన్ అయ్యాయన్నారు. 11,423 మహిళా సంఘాలకు లబ్ది చేకూరనుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంలో సహకార సంఘం అధ్యక్షులు మండే హనుమంతరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేని వీరబాబు, తహసీల్దార్ పుల్లయ్య, అదనపు డీఆర్డీఏ నీలేష్ పాల్గొన్నారు.
