హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలని కృష్ణా బోర్డు ప్రతిపాదించింది. ఇప్పటివరకు రాష్ట్రాల భూభాగంలోని ప్రాజెక్టులు, ఔట్లెట్ల వద్ద ఆయా రాష్ట్ర పోలీసులతో సెక్యూరిటీ ఇస్తుండగా ఇకపై సీఐఎస్ఎఫ్ను నియమించాలని సూచించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయాలని అపెక్స్ కౌన్సిల్లో కేంద్రం నిర్ణయించడంతో ఆ ప్రక్రియను బోర్డులు స్పీడప్ చేశాయి. ఇందులో భాగంగా కృష్ణా బోర్డు శుక్రవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 85లో ఉన్న సబ్ సెక్షన్ 7 ప్రకారం ప్రాజెక్టులు, వాటి నుంచి నీటిని తరలించే ఔట్లెట్ల వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించాలని కేంద్రాన్ని బోర్డు కోరింది. ఎంతమంది సెక్యూరిటీ స్టాఫ్ అవసరమవుతారో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోనుంది.
నీటి లెక్కల మానిటరింగ్
బోర్డు అధీనంలో మొత్తం 10 ప్రాజెక్టులు, వాటి పరిధిలోని 29 ఔట్లెట్లు ఉంటాయని కృష్ణా బోర్డు పేర్కొంది. ఉమ్మడి ప్రాజక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజీ, నాగార్జునసాగర్ టెయిల్పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్, లో లెవల్ కెనాల్స్, కృష్ణా నదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ ఫ్లో, వివిధ ఔట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే ఔట్ ఫ్లోను బోర్డే మానిటరింగ్ చేయనుంది. ఇకపై ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ను సీజన్ల వారీగా బోర్డులకు రాష్ట్రాలు సమర్పించాలి. ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటనెన్స్కు నిధులు రాష్ట్రాలే చెల్లించాలి. టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులనూ సమకూర్చాలి. కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆపరేషన్ మ్యానువల్, ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో, నీటి వినియోగం వ్యవహారాలను రెండు రాష్ట్రాలతో పాటు బోర్డు కలిసి నిర్వహిస్తాయి.
328 మంది ఉద్యోగులు
జ్యూరిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిపి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని కేఆర్ఎంబీ అంచనా వేసింది. వీరిలో 90 శాతానికి పైగా స్టాఫ్ను రెండు రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం యేడాదికి రూ. 3 కోట్ల వరకు ఖర్చవుతుండగా జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజనీర్లు, సెక్యూరిటీ స్టాఫ్తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం రూ. 100 కోట్లకు చేరొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర జలశక్తి శాఖకు పంపి ఆమోదం తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఫైనల్ నోటికేషన్ను కేంద్రం ఆమోదించాక కేఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ అమల్లోకి వస్తుంది.