ఈ నెల 27న హయత్ నగర్లో ఎన్నికలు
నల్గొండ, వెలుగు: మదర్ డెయిరీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడు డైరెక్టర్ల స్థానాలకు 14 మంది నామినేషన్లు వేయగా, 9 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసేసరికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హన్మంతరావు ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకున్న వాళ్లలో ప్రస్తుత చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. రెండోసారి చైర్మన్గా కొనసాగేందుకు కృష్ణారెడ్డి చివరినిమిషం వరకు ప్రయత్నించారు. మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి ఇంకోసారి చాన్స్ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కానీ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ పోటీ నుంచి తప్పుకోవడం అనివార్యమైంది. కృష్ణారెడ్డి ప్లేస్లో నకిరేకల్ నియోజకవర్గంలోని నిదాన్పల్లి సొసైటీ నుంచి మందడి ప్రభాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. భువనగిరి డైరెక్టర్ స్థానానికి కస్తూరి పాండును ఫైనల్ చేశారు. ఆలేరు డైరెక్టర్ స్థానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి గొల్లపల్లి రాంరెడ్డి, కాంగ్రెస్, బీజేపీల నుంచి బత్తుల నరేందర్రెడ్డి, ఎన్. వెంకటనర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. ఈ నెల 27న హయత్నగర్లో ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 278 సంఘాలు ఓటు హక్కు కలిగి ఉన్నాయి. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం జనరల్బాడీ మీటింగ్ పెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అన్నీ కుదిరితే అదే రోజు సాయంత్రం చైర్మన్ ఎన్నిక కూడా పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు.
ఫలించిన మహేందర్ రెడ్డి వ్యూహం
డెయిరీ ఎన్నికలు అనివార్యమే అయినప్పటికీ చైర్మన్పదవి గొంగడి మహేందర్రెడ్డి వర్గీయులకే ఇవ్వాలని పార్టీ డిసైడ్ చేసింది. ఆలేరు నుంచి ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ డైరెక్టర్ శ్రీకర్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 278 సంఘాల్లో 150 ఆలేరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో చైర్మన్ పదవి ఎట్టిపరిస్థితుల్లో తమకే కావాలని మహేందర్రెడ్డి ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. ఈ ఎన్నికల్లో డెయిరీ చైర్మన్ పదవి దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ఆలేరులో ప్రయోజనం చేకూరుతుందని మహేందర్రెడ్డి వర్గం భావిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కీలకమైన పదవుల్లో ఆలేరు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్యే సునీతకు ప్రభుత్వ విప్ ఇవ్వగా ఆమె భర్త మహేందర్రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డెయిరీ చైర్మన్ పదవి కూడా దక్కే అవకాశం ఉంది.